Share News

విద్యార్థులకు నాణ్యమైన విద్య

ABN , Publish Date - Jul 23 , 2025 | 11:31 PM

ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలను అందించాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య
హాస్టల్‌ను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలను అందించాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కల్లూరు మండలం చిన్నటేకూరులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలుర జూనియర్‌ కళాశాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, విద్యాబోధన గురించి ఆరా తీశారు. పిల్లలు నిద్రించేందుకు అదనంగా రెండు గదులను ఏర్పాటు చేసేందుకు నివేదికలు తయారు చేసి పంపించాలని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల కోఆర్డినేటర్‌ శ్రీదేవిని ఆదేశించారు. కళాశాలల్లో కొన్ని గదుల్లో పైకప్పు పాడైనందున వాటితో పాటు అవసరమైన ఇతర మరమ్మతులకు ఎస్టిమేట్‌ వేసి పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్వో మినరల్‌ వాటర్‌ ప్లాంటును ఏర్పాటు చేయాలని కోఆర్డినేటర్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, కలెక్టర్‌ అందుకు స్పందిస్తూ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు గణితం, అధ్యాపకులు బోధిస్తున్న తరగతి గదిలో విద్యార్థితో పాటు కలెక్టర్‌ వెనుక కూర్చుని గణితం పాఠ్యాంశాలను విన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని అధ్యాపకులకు సూచించారు. అలాగే మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించా లన్నారు. విద్యా ర్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట కల్లూరు తహసీల్దార్‌ ఆంజనేయులు, ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, మహేశ్వరప్ప, చైర్మన్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 11:31 PM