మౌలిక సదుపాయాలు కల్పించండి:
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:24 AM
: ప్రధానమంత్రి జన్మన్ కింద గుర్తించిన గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల సదుపాయాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి జన్మన్ కింద గుర్తించిన గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల సదుపాయాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో ప్రధానమంత్రి జన్మన్, డా జుగ పథకాల్లో భాగంగా గుర్తించిన 11అంశాల్లో పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 14మండలాల్లో 48గిరిజన నివాసిత ప్రాంతాల్లో పీఎం జన్మన్ కింద గుర్తించిన 11అంశాల్లో చేపట్టిన పనులపై ప్రత్యేకశ్రద్ధ తీసుకొని పూర్తిచేయాలని ఆదేశించారు. గూడెంలో గృహనిర్మాణాలకు సంబంధించి 527ఇళ్లు మంజూరుకాగా వాటిలో కేవలం 92మాత్రమే పూర్తయ్యాయని, మిగతావాటిని కూడా పూర్తిచేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. కపిలేశ్వరం నుంచి జానాల గూడెం వరకు వేస్తున్న 7.11కి.మీ. బీటీరోడ్డును పూర్తిచేయాలని, రోడ్లులేని గ్రామాల్లో ఏవీ ఉండకుండా ఉపాధిహామీ ద్వారా అనుమతులు తీసుకోవాలని డ్వామా అధికారులను ఆదేశించారు. గిరిజనులకు వైద్య సదుపాయాలు అందజేసేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎంజేఏవై కార్డులద్వారా 5లక్షలవరకు దేశంలో ఎక్కడైనా వైద్యసదుపాయం పొందే అవకాశం ఉందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా రూ.25లక్షల వరకు ఉచిత వైద్యచికిత్సలు పొందే అవకాశం ఉన్నందున చెంచుగూడేల్లోని ప్రజలకు సదరు కార్డులు అందజేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీఓ వెంకటశివప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.