Share News

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:29 AM

: హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు విడుదల చేయనున్నారు.

సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
హెలిప్యాడ్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, అధికారులు, నాయకులు

నందికొట్కూరు, నందికొట్కూరు రూరల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు విడుదల చేయనున్నారు. సీఎం పర్యటనకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి బుధవారం రాత్రిలోగా 36 గంటల్లో టీడీపీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌రాణా పర్యవేక్షణలో అధికారులు పూర్తి చేశారు. అల్లూరు వద్ద గల హెలీ ప్యాడ్‌ పనులను పరిశీలించారు. మల్యాల వద్ద గల హంద్రీనీవా నీటిపంపింగ్‌ స్టేషన్‌, ముఖ్యమంత్రి జలహారతి నిర్వహించే ప్రదేశం, రైతులతో కలిసి మాట్టాడే సభాస్థలి ప్రదేశాలను, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ముందస్తు ఏర్పాట్లను, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆమె తెలిపారు. సీఎం పర్యటన ప్రదేశాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టాలని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు వస్తున్నందు వల్ల ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్‌, ఎస్పీ ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించి తగు సూచనలు చేశారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆర్‌డీవోలు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు

ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా

నందికొట్కూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్ర బాబు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా పోలీసు అధి కారులకు సూచించారు. బుధవారం అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పర్యటన విధుల పట్ల అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం హెలిప్యాడ్‌లో ల్యాండ్‌ అయినప్పటి నుంచి తిరిగి వెళ్లే వర కు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. సీఎం పర్యటనలో ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 37 మంది ఇన్‌స్పెక్టర్లు, 52 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 177 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 308మంది కానిస్టేబుళ్లు, 49మంది మహిళా పోలీసులు, 84మంది హోంగార్డులు, 105 సాయుధ బలగాలు, బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 6స్పెషల్‌ పార్టీ బృందాలతో పటిష్ట బందో బస్తును నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల సబ్‌ డివిజన్‌ ఏఎస్‌పీ మందజావళి ఆల్ఫోన్స్‌, ఎస్‌.ఎస్‌.జి అధికారులు రమణ, శాంతా రావు, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ యుగంధర్‌ బాబు, ఆర్‌ఐవో రాఘవేంద్ర, డిఎస్పీలు ప్రమోద్‌, రామాంజి నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:29 AM