రోగుల అడ్మిషన్ ఎంట్రీలు బాగోలేవు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:38 PM
రోగుల అడ్మిషన్ ఎంట్రీలు బాగోలేవు
డిసెంబరు చివరికి ఓపీ పనులు పూర్తి చేయాలి
కర్నూలు జీజీహెచ్లో కలెక్టర్ తనిఖీలు
కర్నూలు హాస్పిటల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అడ్మిషన్ అయిన రోగుల కేస్షీట్ వివరాలు సరిగ్గా రాయాలని, ఐపీ, ఓపీ వివరాలు సమగ్రంగా లేవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో క్యాజువాల్టీ, మేల్ ఓపీ, క్రిటికల్ ఎమర్జెన్సీ, సూపర్ స్పెసాలిటీ బ్లాక్, న్యూడయోగ్నస్టిక్ బ్లాక్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ క్యాజువాల్టీలోని ఎమర్జెన్సీ మెడిసిన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. వైద్యులు ఎలా చికిత్స అందిస్తున్నారు? ఏ కారణం చేత అడ్మిట్ అయ్యారు? సమయానికి మందులు ఇస్తున్నారా? వైద్యులు సరిగ్గా స్పందిస్తున్నారా? సరిగ్గా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు సంబంధించిన రిజిస్టర్ రోగ నిర్దారణ ఐపీ నెంబర్ల నమోదు సరిగ్గా చేయడం లేదని ఎంట్రీలు సక్రమంగా చేయాలని ఆర్థో విభాగపు వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
స్కోప్ తొలగించకపోవడంపై ఆగ్రహం
చాలా వార్డుల్లో స్ర్కాప్ అలాగే ఉందని, ఎందుకు తొలగించలేదంటూ వైద్యాధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. ఏఎంసీ యూనిట్లో మహిళలకు, పురుషులకు ఒకే టాయిలెట్ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని టాయిలెట్లను మరమ్మతులు చేయించేందుకు రూ.10 లక్షలతో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని యురాలజీ, న్యూరోసర్జరీ ఆపరేషన్ థియేటర్ల పనులు నవంబరు 20లోపు పూర్తి చేయాలని, ఎందుకు చేయలేదని ఏపీఎంఎస్ఐసీ ఇంజనీర్లు కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. డిసెంబరు చివరికల్లా పూర్తి చేస్తామని వారు కలెక్టర్కు వివరించారు. ఈ తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మిబాయి, ఆర్ఎంవో వెంకటరమణ, అడ్మినిస్ర్టేటర్ సింధు సుబ్రహ్మణ్యం, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ చిరంజీవులు పాల్గొన్నారు.