63,818 హెక్టార్లలో వరి సాగు : డీఏవో
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:11 AM
జిల్లా వ్యాప్తంగా 63,818 హెక్టార్లలో వరి సాగు చేశారని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మద్దిలేటి తెలిపారు.
ఉయ్యాలవాడ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 63,818 హెక్టార్లలో వరి సాగు చేశారని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మద్దిలేటి తెలిపారు. బుధవారం ఉయ్యాలవాడ, ఇంజేడు గ్రామాల్లో పర్యటించి వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 5,95,535 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 5,33,460 ఎకరాలు సాగైందన్నారు. అధికంగా 63,818 హె క్టార్లలో రైతులు వరిని సాగు చేశారన్నారు. మొక్కజొన్న 61,924 హెక్టార్లలో, కంది 36,043 హెక్టార్లలో సాగు చేశారన్నారు. వరి పంటలో సస్య రక్షణ చేపట్టాలని రైతులకు సూచించారు.
6ఏ కేసులు నమోదు
జిల్లా వ్యాప్తంగా 109 ఫల్టిలైజర్ షాపులను తనిఖీచేయగా వాటిలో సరిగా లేని 10 షాపులపై 6ఏ కేసులు నమోదు చేసి 83.5 మెట్రిక్ టన్నుల యూరియాను సీజ్ చేశామని డీఏవో తెలిపారు. యూరియాను బ్లాక్మార్కెట్లో అమ్మినా, ప్రభుత్వ ధరల కన్నా ఎక్కువ ధరకు అమ్మినా అలాంటి దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 47,267మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సుధాకర్, ఏవో శ్రీనివాసరెడ్డి ఉన్నారు.