సహనం, సేవా గుణంతో జీవించాలి
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:22 PM
ప్రతి ఒక్కరూ సహనశీలత, సేవాగుణం, త్యాగ నిరతితో జీవించాలని, ఇదే బక్రీద్ పండుగలోని పరమార్థమని ముస్లిం మతపెద్దలు ఉద్బోధించారు.
ముస్లిం మత పెద్దల ఉద్బోధనలు
మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
ఘనంగా బక్రీద్ వేడుకలు
కర్నూలు కల్చరల్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ సహనశీలత, సేవాగుణం, త్యాగ నిరతితో జీవించాలని, ఇదే బక్రీద్ పండుగలోని పరమార్థమని ముస్లిం మతపెద్దలు ఉద్బోధించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదుల వద్ద మతపెద్దలు ఈద్ నమాజ్లు చేయించి, దైవ సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించాలని ఇస్లాం బోధిస్తుందని తెలిపారు. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ దువా చేశారు. నమాజ్ అనంతరం ముస్లింలు ‘ఈద్ ముబాకర్’ చెప్పుకున్నారు.
నగరంలో నాలుగు ఈద్గాలు..
కర్నూలు నగరంలో నాలుగు ఈద్గాలు, సుమారు 150 మసీదుల్లో ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. కొత్త బస్టాండు సమీపంలోని పాత ఈద్గాలో ప్రభుత్వ ఖ్వాజీ సయ్యద్ సలీం బాషా, సంతో్షనగర్లోని కొత్త ఈద్గాలో మౌలానా మన్సూర్ ఖ్వాస్మి, గడ్డ వీధిలో రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ హాఫిజ్ మంజూర్ అహ్మద్, జోహరాపురం ఈద్గాలో హాసిమ్ జామియా మతపెద్దలుగా వ్యవహరిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పాత ఈద్గాలో ప్రార్థనలు చేసి మత పెద్దలకు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.