Share News

తెలుగుజాతి ఖ్యాతిని పెంచిన ఎన్టీఆర్‌: మంత్రులు

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:26 PM

తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు నందమూరి తారకరామారావు అని రాష్ట్ర మంత్రులు ఎన్‌ఎండీ ఫరూఖ్‌ అన్నారు.

తెలుగుజాతి ఖ్యాతిని పెంచిన ఎన్టీఆర్‌: మంత్రులు
ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు ఎన్‌ఎండి ఫరూఖ్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి

అభివృద్ధికి కృషి చేస్తా- ఎంపీ బైరెడ్డి శబరి

గోస్పాడు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు నందమూరి తారకరామారావు అని రాష్ట్ర మంత్రులు ఎన్‌ఎండీ ఫరూఖ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని యాళ్ళూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని, రూ 5.33 లక్షల నిధులతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఆయన ఒక వ్యవస్థ అని అన్నారు. మంత్రి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమానికి పునాది పడిందన్నారు. కిలో రూ 2 బియ్యం, జనత వస్త్రాలు, పక్కా గృహల వంటి విప్లవాత్మక పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. యాళ్ళూరు సీహెచ్‌సీ సెంటర్‌కు తన వంతు కృషిగా నిధులు మంజూరు చేస్తానని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఒక డాక్టర్‌గా ఆస్పత్రికి ఎలాంటి పరికరాలు కావాలో తెలుసు కాబట్టి వాటిని ఆస్పత్రికి అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్‌

సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చికిత్స అందించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. ఆస్పత్రికి కావాల్సిన రోడ్లు, కాంపౌండ్‌ నిర్మాణానికి మంత్రుల సహకారంతో పూర్తి చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ తులసి రెడ్డి, డీఎం అండ్‌ హెచ్‌ఓ వెంకటరమణ, ఓ లలిత, టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి తులసీశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:26 PM