వేతనాలొచ్చేనా..!
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:48 AM
ప్రభుత్వాలు మారినా సమగ్రశిక్ష ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీ రాగానే వేతనాలు అందుతున్నాయి. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రం బడ్జెట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సెప్టెంబరు నెల ముగియడానికి వచ్చినా ఇంతవరకు వేతనాలు అందలేదు. ఇంటి అద్దెలు, పిల్లల పోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు.
సమగ్రశిక్ష ఉద్యోగుల ఎదురుచూపులు
పండుగ పూట పస్తులేనా?
బడ్జెట్ వస్తేనే తనాలంటున్న అధికారులు
కూటమి ప్రభుత్వంలోనూ తప్పని కష్టాలు
ఆలూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్షలో పనిచేసే ఉద్యోగులు వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహించే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వార్షిక బ డ్జెట్ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. సంబంధిత శాఖల హెచ్వోడీల ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా వేతనాలు జమచేస్తూ ఔట్ సోరిసంగ్ ఉద్యోగు లకు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ (ఆప్కాస్) ద్వారా వేతనాలు ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు జమ అవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 550మందికి పైగా..
కర్నూలు జిల్లాలో ఆశాఖ పరిధిలో ఉన్న కేజీబీవీల్లో సీఆర్టీలు, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎంఆర్సీలలో ఆర్పీలు, మెసెంజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌం టెంట్లు, మోడల్ హాస్టల్ వార్డెన్లు, పార్ట్ టైం ట్యూటర్లు, వంట చేసేవారు, వాచ్ మెన్లు, మెసెంజర్లు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, భవిత భవన్లలో ఎంఈఎస్ ఆర్డినేటర్లు, సమగ్రశిక్ష కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ఇలామొత్తం 550 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం కలిపి నిధులు కేటాయి స్తారు. ఒకటో తేదీ వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాట య్యాక సక్రమంగా వేతనాలు వస్తాయని ఆశించిన ఉద్యోగులకు అవే కష్టాలు తప్పడం లేదంటున్నారు. చిరుద్యోగుల వార్షిక బడ్జెట్ను విడుదల చేసి ప్రతి నెలా సక్రమంగా వేతనాలు అందేలా చూడాలని కోరుతున్నారు.
వార్షిక బడ్జెట్ విడుదల చేయాలి
సమగ్రశిక్ష పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లించేం దుకు వార్షిక బడ్జెట్ను విడుదల చేయాలి. దసరా పండగ కావడంతో వేతనాలు లేక చిరుద్యోగులు ఇబ్బందులు పడు తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలి. మహమ్మద్రఫీ, సమగ్రశిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ స్టేట్ కో చైర్మన్
బడ్జెట్ వచ్చాకే వేతనాలు
సమగ్రశిక్ష నుంచి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనాల బడ్జెట్ విడుదల కాలేదు. అందుకే ఆలస్యమవుతుంది. ఉన్నతాధికారులకు కూడా వేతనాల కోసం విన్నవించాం. బడ్జెట్ రాగానే వేతనాలు జమ చేస్తాం. శామ్యూల్పాల్, డీఈవో, కర్నూలు