న్యూ ఇయర్ వేడుకలు మన సంస్కృతి కాదు
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:03 AM
ఆంగ్ల సంవత్సర వేడుకలు మన సంస్కృతి కాదని శ్రీశైలం దేవస్థాన ఈవో శ్రీనివాసరావు అన్నారు.
శ్రీశైలం దేవస్థాన ఈవో శ్రీనివాసరావు
శ్రీశైలం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఆంగ్ల సంవత్సర వేడుకలు మన సంస్కృతి కాదని శ్రీశైలం దేవస్థాన ఈవో శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. మల్లికార్జున, భ్రమరాంబ స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు యథావిధిగా సాగుతాయన్నారు. ఆంగ్ల సంవత్సర ముగింపు, ప్రారంభ రోజున క్షేత్ర పరిధిలో ప్రధానాలయంతో పాటు పరివార ఆలయాల్ల్లో కూడా ప్రత్యేక పుష్పాలతో అలంకరణలు, పూజలు చేసుకునే సంప్రదాయం లేదన్నారు. డిసెంబరు 31వ తేదీ, జనవరి 1న తిథులకు అనుగుణంగా వార పూజలు మాత్రమే శాస్త్రోక్తంగా జరుపనున్నట్లు చెప్పారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తు లకు స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పించేందుకు పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు.
భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు
క్షేత్ర పరిధిలో పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని 1 వ పట్టణ సీఐ గంగనాథ్ జీవన్బాబు హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆలయ పుర వీధులతో పాటు శ్రీగిరి కాలనీ, కొత్తపేట్, పాతాళగంగ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. అర్ధరాత్రి కాగానే రోడ్లపై కేకలు వేసుకుంటూ క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి, భక్తులకు అసౌకర్యం కలిగించొద్దని యువకులకు సూచించారు.