కాపు కాసి.. కారం కొట్టి..
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:01 AM
నగరంలోని శరీన్నగర్లో జరిగిన టీడీపీ నాయకు డు సంజన్న హత్య కేసులో పలు కోణాలు వెలుగు లోకి వచ్చాయి.

వేటకొడవళ్లతో నరికి కార్లలో పరార్
కాపాడబోయిన ఓ మహిళపైనా దాడి
సంజన్న మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
అంజి వర్గీయుల కోసం పోలీసుల గాలింపు
బాధిత కుటుంబానికి ఎంపీ శబరి, గౌరు వెంకటరెడ్డి పరామర్శ
కర్నూలు క్రైం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): నగరంలోని శరీన్నగర్లో జరిగిన టీడీపీ నాయకు డు సంజన్న హత్య కేసులో పలు కోణాలు వెలుగు లోకి వచ్చాయి. శుక్రవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. శనివారం మార్చురీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తుం డటంతో సంజన్న వర్గీయులు పెద్దఎత్తున మార్చురీ వద్దకు చేరుకున్నారు. అంజి వర్గీయులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమని గింది. అనంతరం సంజన్న మృతదేహానికి ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు.
కాపాడబోయిన ఓ మహిళ
సంజన్నకు సుపరిచితురాలైన ఫాతిమాబేగం అనే మహిళ ఆ సమయంలో అక్కడే ఉంది. ఈమె కూడా సంజన్నతో పాటు కరాటేలో శిక్షణ తీసుకు న్నారు. ముందుగానే గుంపులు గుంపులుగా ఉన్న వారిని గుర్తించిన ఆమె సంజన్నను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కోరారు. అయితే సంజన్న పెద్దగా పట్టించుకోలేదు. సంజన్నపై అంజి వర్గీయులు దాడి చేయగానే ఈమె అడ్డుపడింది. సంజన్న కింద పడిపోగానే మీద అడ్డంగా పడి కాపాడబోయే ప్రయత్నం చేసింది. దీంతో అంజి వర్గీయులు ఆమెపై కూడా దాడి చేశారు. చేతిలో ఉన్న కర్రలతో ఆమెను తీవ్రంగా కొట్టారు. ఓ నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేయబోగా కాలితో తన్నడంతో కత్తి కాలికి గుచ్చుకొని గాయమైంది. సంజన్నను కాపా డేందుకు ఆమె తీవ్రంగానే ప్రతిఘటించినట్లుగా తెలుస్తోంది. ఈ సన్నివేశాన్ని కరీం బాషా అనే వ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరి స్తుండగా అంజి వర్గీ యులు ఆ సెల్ఫోన్ను లాక్కున్నారు. ఇంతలో సంజన్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంజి వర్గీయులు సంజన్న కొడుకులపై కూడా కత్తితో దాడి చేయ బోయారు. ఆయన భార్య లక్ష్మీదేవిని పక్కకు తోసే శారు. సంజన్న చనిపోయాడని తెలుసుకుని అక్కడి నుంచి కార్లలో పరారయ్యారు. స్థానిక హ్యాంగవుట్ హోటల్ వద్ద అంజి వర్గీయులు ఉపయోగించిన కారును గుర్తించారు. కారులో సమస్య రావడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసు నమోదు...
సంజన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వడ్డె రామాంజనేయులు అలియాస్ అంజి, ఆయన కొడుకులు వడ్డె కుమార్, శివ, రేవంత్లతోపాటు భార్య, అల్లుడు, మరికొంత మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితో పాటు 29వ కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, శివారెడ్డి పేర్లను కూడా ఆ ఫిర్యాదులో ప్రస్తావించినట్లుగా సమాచారం. నిందితులపై బీఎన్ఎస్-189(4), 191(2), 118(1), 103(1), (2) /రెడ్విత్ 190 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసిన ట్లుగా పోలీసులు తెలిపారు. మార్చురీ వద్ద డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు రామయ్య నాయుడు, తబ్రేజ్, ఎస్ఐలు గోపినాథ్, చంద్రశేఖర్ రెడ్డి, మన్మథ విజయ్లు ఏఆర్ స్పెషల్ పార్టీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందస్తు ప్రణాళికతోనే..
సంజన్న ప్రతి శుక్రవారం మెడిటేషన్ సెంటర్కు వస్తాడనీ అంజి వర్గీయులు ముందుగానే గుర్తించారు. అయితే.. రాత్రి వేళలో ఒంటరిగా దొరుకుతాడని, ఆ సమయంలో అంతమొందించాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడిటేషన్ సెంటరు దగ్గరలోనే అంజి ఇల్లు కూడా ఉంది. శుక్రవారం రాత్రి 12 నుంచి 15 మంది రెండు కార్లలో కారం పొడి, వేటకొడవళ్లు సిద్ధం చేసుకొని సంజన్నను అంతమొందించడానికి ప్రణాళిక వేసుకున్నట్లు సమాచారం. సంజన్న మెడిటేషన్ సెంటరు వద్దకు చేరుకోగానే అప్పటికే కాపు కాసిన వీరంతా సంజన్నపై దాడి చేశారు. ముందుగా కళ్లలో కారం కొట్టి ఆయన సెంటరులోకి వెళ్లక ముందే వేటకొడ వళ్లతో అతికిరాతకంగా నరికారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో నలుగురైదుగురు వృద్ధులు మాత్రమే ఉన్నారు. వారిని కూడా కత్తులు చూపించి బెదిరించినట్లుగా సమాచారం.
ఎంపీ శబరి, గౌరు పరామర్శ..
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం ఉదయం మార్చురీ వద్దకు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకుడు నందికొట్కూరు నియోజ కవర్గ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జరిగిన సంఘటనపై అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు
సంజన్న హత్య కేసులో నిందితులుగా ఉన్న అంజి వర్గీయుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. నలుగురు సీఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయని, అలాగే పికెట్లో రెండు బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.