ఉమ్మడి జిల్లాలో మోస్తరు వర్షాలు
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:13 PM
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో శనివారం నుంచి ఈనెలాఖరు వరకు చిరుజల్లుల నుంచి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది.
భారత వాతావరణ సంస్థ వెల్లడి
వర్షాధార పంటలకు అనుకూలం
తెగుళ్లపై అప్రమత్తం చేస్తున్న శాస్త్రవేత్తలు
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, నంద్యాల జిల్లాల్లో శనివారం నుంచి ఈనెలాఖరు వరకు చిరుజల్లుల నుంచి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. వర్షాలతో పాటు నైరుతి నుంచి పశ్చిమ దిశగా గాలులు గంటకు 10నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని, గాలిలో ఉదయం పూట తేమ 68 నుంచి 73శాతం, మధ్యాహ్నం 50 నుంచి 72ఽశాతం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గుంటూరు ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు అందిస్తున్నారు. రాబోయే ఐదు రోజుల్లో చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నందున వర్షాధార పంటలైన వేరుశనగ, కంది, ఆముదం, పత్తి పంటలను ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకోవచ్చని సూచిస్తున్నారు. పంటలకు ఆశించే తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పత్తిలో రసం పీల్చే పురుగు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పత్తి పంట రసం పీల్చే పురుగు ఆశించొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. లీటరు నీటికి వేపనూనె 5.0ఎంఎల్ లేదా ఐదుశాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి.
మొక్కజొన్నలో కత్తెరపురుగు
ప్రస్తుతం మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. పురుగు ఉనికిని గుర్తించడానికి ఎకరాకు నాలుగు ఫిరమోన్ ఎరలు ఏర్పాటు చేయాలి. ఒక ఫిరమోన్ ఎరలో 10 పురుగులు పడినట్లయితే వెంటనే లీటరు నీటికి 5 ఎంఎల్ వేపనూనె కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. పురుగు ఉధృతిని బట్టి లీటరు నీటికి రెండు గ్రాముల థయోడికార్బ్ లేదా 0.4గ్రాముల ఇమామేక్టిన్ బెంజోయెట్ పిచికారి చేయాలి.