ఉమ్మడి జిల్లాలో మోస్తరు వర్షం
ABN , Publish Date - May 26 , 2025 | 11:38 PM
నైరుతి రుతుపవనాలు 16 సంవత్సరాల తర్వాత 8 రోజులు ముందుగానే కేరళ తీరాన్ని తాకిన తర్వాత తూర్పు, వాయివ్యదిశగా కదులుతూ సోమవారం రాయలసీమలోకి ప్రవేశించాయి.
మూడు రోజుల పాటు విస్తారంగా వానలు
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
నంద్యాల ఎడ్యుకేషన్, మే 26 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు 16 సంవత్సరాల తర్వాత 8 రోజులు ముందుగానే కేరళ తీరాన్ని తాకిన తర్వాత తూర్పు, వాయివ్యదిశగా కదులుతూ సోమవారం రాయలసీమలోకి ప్రవేశించాయి. దీంతో కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో పలు మండలాల్లో సోమవారం మోస్తరు వర్షాలు పడ్డాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సోమవారం కర్నూలు జిల్లాలో 24.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, నంద్యాల జిల్లాలో 26.6డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
మూడు రోజుల పాటు...
ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని, నంద్యాల జిల్లాలో 15.6ఎంఎం నుంచి 64.4 ఎంఎం వరకు మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం పడే సూచనలున్నాయని, కర్నూలు జిల్లాలో 2.5 ఎంఎం నుంచి 15.5 ఎంఎం వరకు సాధారణ వర్షపాతం నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు. 28న నంద్యాల, కర్నూలు జిల్లాలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశముందని, రెండు జిల్లాలో 15.6 ఎంఎం నుంచి 64.4 ఎంఎం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. 29వ తేదీ ఉరుములు మెరుపులతోపాటు 50 నుంచి 60కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశముందని, ఉమ్మడి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది.
నంద్యాల జిల్లాలో నమోదైన వర్షపాతం
శ్రీశైలం మండలంలో 35.2, పగిడ్యాల 19.2, వెలుగోడు 19.2, నందికొట్కూరు 18.2, మిడ్తూరు 14.6, జూపాడుబంగ్లా 13.8, గడివేముల 12.2 ఎంఎం వర్షపాతం నమోదైంది. అలాగే కొత్తపల్లె 10.6, బండిఆత్మకూరు 7.8, ఆత్మకూరు 7.6, పాములపాడు 6.8, ఆళ్లగడ్డ 6.8, రుద్రవరం 3.2, గోస్పాడు 3.2, పాణ్యం 2.6, చాగలమర్రి 2.6, డోన్ 1.2ఎంఎం వర్షపాతం నమోదైంది.
కర్నూలు జిల్లాలో వర్షపాతం
గోనెగుండ్ల 13.8, నందవరం 11.6, ఆస్పరి 11.2, ఆలూరు 11.2, హోళగుంద 7.2, సి.బెళగల్ 6.0, గూడూరు 5.0, కర్నూలు 4.6ఎంఎం వర్షపాతం నమోదైంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు కలెక్టరేట్, మే 26 (ఆంధ్రజ్యోతి): వాతావరణ శాఖ సూచనల ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల శాఖల అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలియజేస్తూ నష్టం కలగకుండా చూడాలన్నారు. హోర్డింగులు, చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలిచి ఉండరాదని సూచించారు. అలాగే నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న చోట వాగులు, వంకలు, నదులు దాటరాదన్నారు.