10న ‘మెగా పీటీఎం 2.0’
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:12 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో అని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

ప్రజా ప్రతినిధులను, పూర్వ విద్యార్థులను ఆహ్వానించాలి
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో అని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పేరెంట్- టీచర్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10న జరిగే మేగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులతో స్వయంగా ఆహ్వాన పత్రికలను తయారు చేయించి కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇతర ప్రజాప్రతినిధులను పూర్వ విద్యార్థులను ఆహ్వానించాలన్నారు. సంబంధిత పాఠశాల, కళాశాలల్లో ప్రతిభ సాధించిన వారు ఎవరైనా ఉంటే వారు షైనింగ్, స్టార్ అవార్డులు తీసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలన్నారు. అలాగే పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా సమావేశానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విద్యార్థికి సంబంధించిన సమగ్ర పురోగతి కార్డులను అందించాలన్నారు. సమావేశంలో పాఠశాల విద్యాపరమైన పనితీరు, కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించాలన్నారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించి తల్లిదండ్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలన్నారు. అదే విధంగా శుభ్దిన్ భోజనం పేరుతో మధ్యాహ్న భోజనం అందించాలన్నారు.