అమరవీరుడు మురళీనాయక్
ABN , Publish Date - May 10 , 2025 | 12:27 AM
భారతమాత రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు జవాన్ మురళీనాయక్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

విమానాశ్రయంలో నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
ఓర్వకల్లు, మే 9 (ఆంధ్రజ్యోతి): భారతమాత రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు జవాన్ మురళీనాయక్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం 5:55 గంటలకు సీఎం చంద్రబాబు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. దేశ రక్షణ విధుల్లో ఉండగా పాక్ సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందిన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన వీరజవాన్ మురళీనాయక్ చిత్రపటం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలుగువీరుడు మురళీనాయక్ అని కొనియాడారు. చంద్రబాబుతో పాటు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ బి.నవ్య, ఆర్డీవో సందీప్ కుమార్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు వీరజవాన్ మురళీనాయక్కు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు అమరావతికి బయలుదేరి వెళ్లారు.