Share News

చాంపియన్‌ ట్రోఫీ సంబరాల్లో అపశ్రుతి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:58 AM

చాంపియన్స్‌ ట్రోఫీ సంబరాల్లో దొర్లిన అపశ్రుతి వల్ల ఓ పండ్ల వ్యాపారి కంటిచూపు కోల్పోయాడు. ఈ ఘటన నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచే సుకుంది

చాంపియన్‌ ట్రోఫీ   సంబరాల్లో అపశ్రుతి
బాధితుడిని పరామర్శిస్తున్న ఎన్‌ఎండీ ఫిరోజ్‌, ఇన్‌సెట్‌ బాధితుడు

ఆకతాయిల వల్ల కన్ను కోల్పోయిన పండ్ల వ్యాపారి

బాధితుడిని పరామర్శించిన ఎన్‌ఎండీ ఫిరోజ్‌

నంద్యాల హాస్పిటల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): చాంపియన్స్‌ ట్రోఫీ సంబరాల్లో దొర్లిన అపశ్రుతి వల్ల ఓ పండ్ల వ్యాపారి కంటిచూపు కోల్పోయాడు. ఈ ఘటన నంద్యాల పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచే సుకుంది. ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ తుదిపోరులో ఇండియా జట్టు గెలవడంతో క్రికెట్‌ క్రీడాభి మానులు పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు భారీఎత్తున పేల్చిన బాణాసంచా రవ్వలు అటుగా వెళ్తున్న తోపుడుబండి వ్యాపారి మహబూబ్‌బాషా కంటికి తగలడంతో తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని బాలాజీ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించాక కన్ను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యుడు ఓబుల రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌బాషా కన్ను పూర్తిగా ఛిద్రమైందని సర్జరీ ఆలస్యమైతే మరో కంటికి ప్రమాదం ఉన్నందున ఎడమ కంటిని తొలగించామన్నారు. మహబూబ్‌బాషాకు భార్య, కుమార్తె, చెవిటి, మూగ కుమారుడు ఉన్నారు.

బాధితుడి కుటుంబానికి అండగా ఉంటాం : ఫిరోజ్‌

క్రికెట్‌ సంబరాల సందర్భంగా బాణాసంచా పేలుళ్లలో కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయిన మహబూబ్‌బాషా కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్‌ అన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:59 AM