ప్లాస్టిక్ వాడితే లైసెన్సు రద్దు
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:41 PM
శ్రీశైల మహా క్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడితే వ్యాపారాల లైసెన్స్ రద్దు చేస్తామని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు.
శ్రీశైలంలో వ్యాపారులకు ఈవో హెచ్చరిక
శ్రీశైలం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్ర పరిధిలో పర్యావరణ పరిరక్షణ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడితే వ్యాపారాల లైసెన్స్ రద్దు చేస్తామని ఈవో శ్రీనివాసరావు హెచ్చరించారు. శ్రీశైలంలోని మల్లికార్జున కల్యాణ మండపంలో బుధవారం వ్యాపార సంఘాలు, సత్ర నిర్వాహకులు, తోపుడుబండ్ల చిరు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిలిపివేయమని పలుమార్లు అవగాహన కల్పిస్తున్పప్పటికీ కొందరు నిబంధనలు అతిక్రమిస్తున్నారని చెప్పారు. దేవస్థానం నిర్ణీత ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించకుండా ప్లాస్టిక్ వాడకం కొనసాగించే వ్యాపారాల లైసెన్సులను పూర్తిగా రద్దు చేస్తామని ఈవో చెప్పారు. జ్యూట్ బ్యాగులు, బట్ట సంచులు, కాగితం కవర్లు వంటి వాటిని యాత్రికుల అవసరాలకు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదే విధంగా దేవస్థానం లడ్డూ విక్రయాలకు వినియోగించే డీఆర్డీవో బయో కంపోస్టబుల్ కవర్లు కూడా వినియోగించుకోవచ్చునని ఆలయ అధికారులు తలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.