అదుపులో శాంతిభద్రతలు: ఎస్పీ
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:31 PM
జిల్లాలో శాంతి భద్రతలు, నేరాలు అదుపులోనే ఉన్నాయని ఎస్పీ విక్రాంత్పాటిల్ అన్నారు.
మంత్రాలయం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతి భద్రతలు, నేరాలు అదుపులోనే ఉన్నాయని ఎస్పీ విక్రాంత్పాటిల్ అన్నారు. గురువారం మంత్రాలయం, మాధవరం పోలీస్స్టేషన్లను ఆయన పరిశీలిం చారు. ముందుగా డీఎస్పీ భార్గవి, సీఐ రామాంజులు, మాధవరం ఎస్ఐ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్లో మొక్కలునాటారు. అనంతరం పోలీస్స్టేషన్లలో రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలు, మట్కా, చోరీలు, మిస్సింగ్ వంటి కేసులపై ఆరాతీశారు. మంత్రాలయంలో ట్రాఫిక్, రద్దీపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 5 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగా యన్నారు. కర్ణాటక మద్యం, మట్కా, దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మంత్రాలయంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు పోలీసులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాయంత్రం ఎస్పీ విక్రాంత్ పాటిల్ శ్రీమఠాన్ని సందర్శించారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పూజలుచేశారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవ స్త్రం, ఫల, పుష్ప, మంత్రాలక్షింతలు ఇచ్చి ఎస్పీని ఆశీర్వదించారు.