‘ఉపాధి’లో పెరిగిన కూలి
ABN , Publish Date - May 15 , 2025 | 12:04 AM
ఉపాధి పనులకు రోజు ఇచ్చే వేతనాలు కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. వేసవిలో ప్రత్యేక భత్యం ఇవ్వనందున ఆ లోటును భర్తీ చేసేందుకు దినసరి కూలీని రూ.300ల నుంచి రూ.307లు పెంచింది. ఈ పెంపును గత నెల నుంచి అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
కూలీల హర్షం
ఆలూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధి పనులకు రోజు ఇచ్చే వేతనాలు కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. వేసవిలో ప్రత్యేక భత్యం ఇవ్వనందున ఆ లోటును భర్తీ చేసేందుకు దినసరి కూలీని రూ.300ల నుంచి రూ.307లు పెంచింది. ఈ పెంపును గత నెల నుంచి అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు. మండలంలోని 16 పంచాయతీల్లో 10వేల జాబ్కార్డులు ఉండగా, ఉపాధి పనులకు 3,070 మంది వస్తున్నారు. మూడేళ్ల క్రితం ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసవి భత్యం కింద కూలీలకు 15 శాతం నుంచి 30 శాతం వరకు అదనంగా ఇచ్చేవారు. దీనికోసం పనుల కోసం తీసుకు వెళ్లే పరికరాల కోసం, తాగునీరు, మజ్జిగకు సంబంధించి అదనపు భత్యం ఉండేది. అయితే ఇప్పుడు భత్యం ఇవ్వడం లేదు, కూలిని స్వల్పంగా పెంచారు.
కొలత ప్రకారం వేతనం
ఉపాధి కూలీలకు కొలతలు ప్రకారం వేతనం వస్తుంది. వీరికి వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వేసవి దృష్ట్యా కూలీలు వడదెబ్బకు గురికాకుండా రెండు పూటలా పనులు కల్పిస్తున్నాం. - శ్రీనివాసులు, ఏపీవో, ఆలూరు.