Share News

జీఎస్టీ వసూళ్లలో కర్నూలు టాప్‌

ABN , Publish Date - May 07 , 2025 | 12:11 AM

రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే కర్నూలు జిల్లా జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ సుధాకర్‌రావు తెలిపారు.

జీఎస్టీ వసూళ్లలో కర్నూలు టాప్‌
మాట్లాడుతున్నజాయింట్‌ కమిషనర్‌ సుధాకర్‌రావు

ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.99.55 కోట్ల రాబడి

వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ సుధాకర్‌రావు

కర్నూలు న్యూసిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే కర్నూలు జిల్లా జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ సుధాకర్‌రావు తెలిపారు. మంగళవారం కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్‌ బంకు సమీపంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది ఏప్రిల్‌లో రూ.89.404 కోట్లు జీఎస్టీ రాగా, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రూ.99.55 కోట్లు జీఎస్టీ వసూళ్లు అయిందన్నారు. ఈమేరకు 12 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. జిల్లాలో గ్రీన్‌ఎనర్జీ, సోలార్‌ ఎనర్జీ, మైనింగ్‌ తదితర కార్యకలాపాల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఆన్‌లైన్‌ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని గమనించి నాలుగు నెలల నుంచి నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రతి నెల 200కు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. గతంలో నేరుగా తనిఖీలు చేపట్లేవారమని, ప్రస్తుతం రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్టీ చెల్లించకుండా అక్రమంగా వస్తువులను రవాణాచేసే వాహనాలను పట్టుకుని సీజ్‌ చేస్తామన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో వస్తువులను స్వాధీనం చేసుకుని పంపుతామన్నారు. అనంతరం ఆ వస్తువులను వేలం వేస్తామన్నారు. ఇటీవల ఆదోనిలో స్థానిక పోలీసులతో కలిసి ఓ బంగారు వ్యాపారి వద్ద అక్రమ బంగారాన్ని గుర్తించి రూ.9లక్షలు జరిమానా విధించామన్నారు.

Updated Date - May 07 , 2025 | 12:11 AM