డ్రోన్ హబ్గా కర్నూలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:12 AM
కందనవోలు జన పరవళ్లలో పులకరించింది. దేశ, రాష్ట్ర పాలనాధీశులు కర్నూలు గడ్డపై సీమ పౌరుషాన్ని కొనియాడారు.
ఉయ్యాలవాడ, గాడిచర్ల స్ఫూర్తి మరవలేనిది
కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోదీ
త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టుబడులకు స్వర్గధామం
సీఎం చంద్రబాబునాయుడు
వెల్లువలా తరలివచ్చిన అశేష జనవాహిని
‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ సభ సూపర్ సక్సెస్
రాగమయూరి గ్రీన్హిల్స్ జనసంద్రం
కర్నూలు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కందనవోలు జన పరవళ్లలో పులకరించింది. దేశ, రాష్ట్ర పాలనాధీశులు కర్నూలు గడ్డపై సీమ పౌరుషాన్ని కొనియాడారు. జన సందోహాన్ని చూసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, విద్య, ఐటీ శాఖ మంత్రి నారాలోకేశ్ ఆనందంతో పరవశించిపోయారు. జిల్లా యం త్రాంగం, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకుల సమష్టి కృషి కందనవోలు ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే తొలిసారిగా కర్నూలు గడ్డపై నిర్వహించిన సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈకార్యక్రమానికి వేదిక అయినా రాగమయూరి గ్రీన్హిల్స్ జనసంద్రమైంది. పూల వర్షంతో కూటమి అతిరథ మహారథులను ముంచేశారు. సీమ సంప్రదయాలను ఇనుమడింపజేసే కళాప్రదర్శలు, సంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందడం మినహా భారత ప్రధాని మోదీ హాజరైన భారీ బహిరంగ సభ గురువారం ప్రశాంతంగా.. దిగ్విజయంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం, కూటమి నేతలు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీ శ్రీశైలం విశిష్టత, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్ఫూర్తిని కొనియాడుతూ ప్రసంగం మొదలు పెట్టడంతో సభా ప్రాంగణం హర్షద్వానాలతో మార్మోగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాన్, యువనేత నారా లోకేశ్ ప్రసంగం కూటమి నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
సరికొత్త అధ్యాయనానికి నాంది
భారతదేశంలో సరికొత్త అఽధ్యాయనానికి కర్నూలు డ్రోన్ హబ్ నాంది పలుకుతుం దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్లో డ్రోన్లు ఎంతో శక్తివంతంగా పనిచేసి సత్తా చాటాయని, అలాంటి డ్రోన్ల తయారీకి వేదికగా ఓర్వకల్లు కాబోతుందన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ద్వారా రాయలసీమ ప్రాంతం పెట్టుబడులకు స్వర్గధామం అవతుందని గుర్తుచేశారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన అహోబిలం నరసింహాస్వామి, మహానంది నందీశ్వరుడు, శ్రీశైలం జ్యోతిర్లింగం, మంత్రాలయం రాఘవేంద్రస్వాములు ఆశీస్సులు ఆకాంక్షిస్తూ మొదలు పెట్టిన మోదీ ప్రసంగం సభికులను ఉత్సాహా పరిచింది. తొలి స్వాతంత్య్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పౌరుషాన్ని, హరిసర్వోత్తమరావు స్పూర్తిని మోదీ కొనియాడడంతో ఆప్రాంతంపై ఆయనకు ఉన్న అనురాగాన్ని గుర్తుచేసింది.
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్తో...
కర్నూలుకు త్వరలోనే హైకోర్టు బెంచ్ రాబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీ భారతదేశానికి తలమానికం కాబోతుందని గుర్తుచేశారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్తో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు రాబోతున్నాయని సీఎం వివరించారు. సెమీ కండక్టర్, చిప్ తయారీకేంద్రంగా ఓర్వకల్లు మారుతుందన్నారు.
ఘన స్వాగతం.. వీడ్కోలు
కర్నూలు, శ్రీశైలం పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మకు జిల్లా నాయకులు ఘన స్వాగతం,వీడ్కోలు పలికారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివా్సవర్మ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, బీజీ జనార్ధన్రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు పి.తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్, జనసేన ఇన్చార్జి చింతా సురేశ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు గౌరు చరిత, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, బొగ్గుల దస్తగిరి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, డాక్టర్ పార్థసారథి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్రెడ్డి, గిత్తా జయసూర్య, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, నందికొట్కూరు. ఆదోని, ఆలూరు, మంత్రాలయం టీడీపీ ఇన్చార్జిలు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, వైకుంఠం జ్యోతి, ఎన్.రాఘవేంద్రరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ చైన్మన్ పూల నాగరాజు, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆదోని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కంతోట రామకృష్ణ, సీనియర్ నాయకుడు పురుశోత్తం రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ చైర్పర్సన్, కప్పట్రాళ్ల బొజ్జమ్మటీడీపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జి వెంకటరాముడు, కురవ కార్పోరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప తదితరులు స్వాగతం పలికారు.