కాల్వలు ఇలా...నీరు పారేదెలా...?
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:35 AM
నంద్యాల జిల్లాలో తాగు, సాగునీరు అందించే ప్రధాన కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉంది.
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో తాగు, సాగునీరు అందించే ప్రధాన కాల్వల పరిస్థితి అధ్వానంగా ఉంది. కాల్వల మరమ్మతులకు రెండునెలల సమయం ఉన్నప్పటికీ జలవనరులశాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనుపడుతోంది. కాల్వల్లో గుర్రపుడెక్క పేరుకుపోయి నీళ్లు ముందుకెళ్లడం లేదు. మహానంది రోడ్లోని అబాండతాండ సమీపంలో వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే పాలేరు వాగు పూర్తిగా మూసకపోయింది. నీళ్లు ముందుకు పారకుండా పొలాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే కేసీ కెనాల్కు మూడు అడుగుల మేర నీరు విడుదల చేశారు. నేటికి కాల్వ పూర్తిస్థాయిలో ప్రవహించే అవకాశముంది. నంద్యాల పట్టణానికి తాగునీటిని అందించే తూము వద్ద మట్టి కుంగిపోయి తూము షట్టర్లలకు ప్రమాదం ఏర్పడే అవకాశమున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం.
కేసీకి 1,500 క్యూసెక్కుల నీరు విడుదల
సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్కు 1, 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు ఈఈ ప్రతాప్ తెలిపారు. గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీకి సోమవారం నీరు విడుదల చేశామన్నారు. నేడు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తెలుగుగంగకు విడుదల చేస్తామన్నారు.