కేసీ కెనాల్ ఈఈని సస్పెండ్ చేయాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:04 PM
కేసీ కేనాల్ ఈఈ, తెలుగుగంగ ఇన్చార్జి ఎస్ఈ ప్రతా్పను సస్పెండ్ చేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ డిమాండ్ చేశారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల రూరల్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కేసీ కేనాల్ ఈఈ, తెలుగుగంగ ఇన్చార్జి ఎస్ఈ ప్రతా్పను సస్పెండ్ చేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ డిమాండ్ చేశారు. మంగళవారం నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్లో నిర్వహించిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో అధికారులు వ్యవహరించిన తీరుపై ఆమె మండిపడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కేసీ కెనాల్, తెలుగుగంగ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు రబీలో నీరు ఇవ్వమని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈఈ ప్రతా్పకు నీటి పారుదలపై అవగాహన లేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. నీరు తగినంత ఉన్నప్పటికీ ఆళ్లగడ్డపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి నీరు ఇవ్వడానికి ఈఈ ప్రతాప్ సీఎం నుంచి అనుమతి రావాలని చెప్పడం రైతులను రెచ్చగొట్టడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. . అధికారుల తీరుపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేశ్, ఇరిగేషన్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సమావేశంలో రాంభూపాల్ రెడ్డి, తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్ కుమార్రెడ్డి, ఆళ్లగడ్డ తెలుగు గంగ, కేసీ కెనాల్ ప్రాజెక్టు డిస్టిబ్యూటరీ డైరెక్టర్లు పాల్గొన్నారు.