మొండి గోడలకే పరిమితం
ABN , Publish Date - May 11 , 2025 | 10:46 PM
ప్రభుత్వానికి కోట్లలో ఆదాయాన్ని సమకూర్చే ఆదోని మార్కెట్ యార్డులో పనులు నిలిచిపోయాయి. జంబో షెడ్ పనులు ఆగిపోవడంతో మొండి గోడలు వెక్కి రిస్తున్నాయి
ఆగిపోయిన జంబో షెడ్ నిర్మాణం
పత్తి తడిసి తీవ్రంగా నష్టపోతున్న రైతులు
ఆదోని ఆదోని అగ్రికల్చర్, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి కోట్లలో ఆదాయాన్ని సమకూర్చే ఆదోని మార్కెట్ యార్డులో పనులు నిలిచిపోయాయి. జంబో షెడ్ పనులు ఆగిపోవడంతో మొండి గోడలు వెక్కి రిస్తున్నాయి. గత టీడీపీ హయాంలో పత్తి యార్డులోని ప్లాట్ఫాంలో రూ. 2కోట్లతో జంబో షెడ్ కవర్డ్ షెడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాంట్రాక్టర్ సివిల్ వర్క్ కింద రూ. కోటిపైగా ఖర్చు చేసి గోడలు నిర్మించారు. అయితే పనులు పూర్తయ్యే సమయానికి ఎన్నికలు రావడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. వైసీపీ హయాంలో ఐదేళ్లుగా అలాగే మొండి గోడకే పరిమితమైంది. పత్తి దిగుబడులు వర్షానికి తడిసిపోతున్నాయి. భారీ వర్షాల దెబ్బకు పత్తి దిగుబడులు తడిచి రైతులు తీవ్రంగా నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికి ఎనిమిది సార్లు టెండర్ పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో పనులు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే పనులు పూర్తి చేస్తాం
పత్తి ఫ్లాట్ఫాం కవర్ షెడ్ నిర్మాణం సివిల్ పనులు పూర్తయ్యాయి. రూఫ్ లెవెల్లో ఇనుప రేకులు వేయాల్సి ఉంది. రూ.కోటితో షెడ్ ఇనుప రేకులు వేయడానికి టెండర్ పిలిచి, సీజన్ ఆరంభంలోపు పూర్తి చేస్తాం. - సుబ్బారెడ్డి, డీఈ మార్కెటింగ్ శాఖ