‘ఫెయిల్’ భయం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:41 AM
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భావించి భయపడిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బండిఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరులో శుక్రవారం చోటు చేసుకుంది.

బండిఆత్మకూరు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భావించి భయపడిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బండిఆత్మకూరు మండలంలోని ఏ.కోడూరులో శుక్రవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏ.కోడూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వెంకట సుదీశ్వరరెడ్డి (16) నంద్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే పరీక్షలు పూర్తి చేసుకున్న సుదీశ్వర రెడ్డి కొంతకాలంగా ముభావంగా ఉండేవాడు. ఈ క్రమంలో శనివారం ఫలితాలు విడుదల అవుతాయని తెలుసుకున్న యువకుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫెయిల్ అయితే ఇంటా, బయటా అవమాన పాలవుతానని భావించిన సుదీశ్వర రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.