ఎండీయూ వాహనాల రద్దుతో బియ్యం అక్రమ రవాణాకు చెక్
ABN , Publish Date - May 30 , 2025 | 11:20 PM
ఎండీయూ వాహనాల రద్దుతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఆస్కారం ఉండదని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు అన్నారు.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు
నందికొట్కూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): ఎండీయూ వాహనాల రద్దుతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఆస్కారం ఉండదని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు అన్నారు. శుక్రవారం నందికొట్కూరు ఎంఎల్ఎస్ పాయింట్తో పాటు సెంట్రల్ వేర్ హౌస్లను డైరెక్టర్లు మహేష్ నాయుడు, లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు. ఎంఎల్ఎస్ గోదాములో రేషన్ బియ్యం నిల్వలను పరిశీలించారు. గోదాములో ఉన్న బియ్యం బస్తాలను తూకాలు వేసి చూశారు. దీంతో ఒక బస్తా 43 కేజీలు, మరో బస్తా 44 కేజీలు రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్లకు ఖచ్చితమైన తూకంతో బియ్యం చేరవేయాలన్నారు. అనంతరం మహేష్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉన్న ఎండీయూ వాహనాలను రద్దు చేసి, ఒకటో తేదీ నుంచి డీలర్ల ద్వారానే పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకంలోనూ, రెసిడెన్సియల్ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు జూన్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం అందజేస్తామన్నారు.