పొరపాట్లు జరిగితే మీదే బాధ్యత
ABN , Publish Date - May 16 , 2025 | 11:34 PM
సీఎం చంద్రబాబు నాయుడు సి.క్యాంపు రైతుబజారు పర్యటనలో చిన్న పొరపాటు జరిగినా మార్కెటింగ్ శాఖ యంత్రాంగానిదే బాధ్యత అని కలెక్టర్ రంజిత్బాషా స్పష్టం చేశారు.
అర్జీలు స్వీకరించేందుకు కౌంటర్ ఏర్పాటు
స్టేజీ, స్టాల్స్, పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు
కలెక్టర్ పి.రంజిత్ బాషా
ప్రోగ్రాం కోర్డినేటర్, ఎస్పీతో కలిసి పనుల పరిశీలన
కర్నూలు అగ్రికల్చర్, మే 16 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు సి.క్యాంపు రైతుబజారు పర్యటనలో చిన్న పొరపాటు జరిగినా మార్కెటింగ్ శాఖ యంత్రాంగానిదే బాధ్యత అని కలెక్టర్ రంజిత్బాషా స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ సి.క్యాంపు రైతుబజారుతో పాటు ప్రజావేదిక వద్ద జరుగుతున్న పనులను ఏపీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి పరిశీలించారు. సి.క్యాంపు రైతుబజారు, ప్రజావేదిక, స్వచ్ఛాంధ్ర పార్కు ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్న పనులపై వారు సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి సంబంధించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిం చేందుకు కౌంటర్ ఏర్పాటుచేయడంతో పాటు బ్యానర్ ఏర్పాటుచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ డ్వామా పీడీలను ఆదేశించారు. స్టేజీ, స్టాల్స్, కాన్వాయ్, వీఐపీ పార్కింగ్ ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ డా.బి.నవ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత, కర్నూలు ఆర్డీవో సందీప్కుమార్, టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కడప జేడీ రామాంజనేయులు ఉన్నారు.