ఇళ్లు.. ఎన్నేళ్లు..!
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:16 PM
ఇళ్లు.. ఎన్నేళ్లు..!
వైసీపీ హయాంలో అంతులేని నిర్లక్ష్యం
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా పురోగతి మందగమనం
జిల్లాలో 11,706 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం
ఇప్పటికే ఖర్చు చేసిన రూ.601.69 కోట్లు నిరుపయోగం
అసంపూర్తిగా పేదల ఇళ్లు
వైసీపీ హయాంలో నాటి సీఎం జగన్ ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం..! అంటూ ప్రగల్భాలు పలికారు. జగనన్న కాలనీల పేరిట జరిగిన భూసేకరణలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. పేదల ఇళ్లు నిర్మాణంలో ఐదేళ్లు నిర్లక్ష్యం కారణంగా పేదలకు సొంతిల్లు కలగానే మారింది. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రావడంతో సొంతింటిపై పేదల ఆశలు చిగురించాయి. అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలు కల్పిస్తారని ఆశించారు. ఏడాది గడిచింది. ఆశలు ఎండమావిగా మారాయి. ఇళ్ల నిర్మా ణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వాటి కో సం ఖర్చు చేసిన రూ.601.69 కోట్లు ప్రజాఽ దనం నిరర్ధకంగా మారింది. అంతేకాదు పట్ట ణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం స్పష్ట మైన హామీ ఇచ్చినా.. ఆ దిశగా చర్యలు చేప ట్టలేదు. దీంతో గూడు లేని నిరుపేదలు ప్రభు త్వ ఇళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు.
కర్నూలు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదల నిర్మాణంలో అంతులేని జాప్యం కనిపిస్తోంది. కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపాలిటీ పట్టణాలు, 26 మండలాల పరిధిలో పీఎంఏవై (అర్బన్, గ్రామీణ) కింద 2014-15 నుంచి 2023-24 వరకు పదేళ్లలో పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు 53,967 ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 50,032 ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. అందులో 29,408 ఇళ్లు పూర్తి చేశామని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. వివిఽ ద దశల్లో ఉన్న 20,711 ఇళ్లను పూర్తి చేసి పేదలకు గూడు, నీడ కల్పించాలని కూటమి ప్రభు త్వం లక్ష్యాలను నిర్దేశించింది. వాస్తవంగా గతేడాది డిసెంబరు ఆఖరిలోగా 4,422 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేలా టార్గెట్ ఇచ్చినా అది జరగలేదు. తాజాగా వివిధ దశల్లో ఉన్న 20,711 ఇళ్లలో 11,706 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం కల్పిం చాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో జిల్లా కలెక్టరు పి.రంజిత్బాషా గృహ నిర్మాణ శాఖ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పలు పట్ట ణాల్లో ప్రభుత్వం ఇళ్లు అసంపూర్తిగా వదిలేశారు. వాటిని పూర్తి చేసి పేదలకు అప్పగించపోతే నిర్వహ ణ లేక శిథిలావస్థకు చేరుకొని కుప్పకూలే పరిస్థితి ఉంది.
లక్ష్యం నెరవేరేనా?
జిల్లాలో వివిధ దశల్లో 20,711 ఇళ్లు ఉన్నాయి. అందులో 11,706 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని టార్గెట్ పెట్టుకున్నారు. వారం వారం కలెక్టరు పి.రంజిత్బాషా ప్రభుత్వ ఇళ్ల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పూర్తి చేసిన టార్గెట్ 7,928 ఇళ్లు. ఇంకా 3,778 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఏపీ గృహ నిర్మాణ శాఖ చూపిస్తున్న రికార్డుల్లో చూపని లెక్కలు ఇవి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మిగనూరు, ఆదోని తరహాలో నాలుగు గోడలు కట్టి, దానిపై ఆర్సీసీ స్లాబ్ వేస్తే ఇల్లు నిర్మాణం పూర్తయినట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఇంటి లోపల సిమెంట్ ప్లాస్టింగ్, బండలు, మరుగుదొడ్లు.. వంటి సౌకర్యాలు మెజార్టీ ఇళ్లకు లేవని తెలుస్తోంది.
అసంపూర్తి ఇళ్లు.. పట్టించుకోని పాలకులు
ఎమ్మిగనూరు పట్టణంలో మాచాని శివన్న నగర్లో ఏపీ టిడ్కో ఇళ్ల సముదాయం పక్కనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీ నిర్మాణం పేరిట 2,300 ఇళ్లు మంజూరు చేశారు. 1999-2004 మధ్యలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర మంత్రి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ మోహన్రెడ్డి పట్టణంలో పేదలకు ఒక్కొక్కరికి మూడు సెంట్లు చొప్పున ఇంటి స్థలం పట్టాలు ఇచ్చారు. 2021-22లో వైసీపీ ప్రభుత్వం ఆ పట్టాలను రద్దు చేసి జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2,300 ఇళ్లను మంజూరు చేయడంతో పాటు నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులను ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. రూ.46.88 కోట్లు ఖర్చు చేసి 2,204 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించారు. కాంట్రాక్ట్ సంస్థ కేవలం నాలుగు గోడలు నిర్మించి, ఆర్సీ స్లాబ్ వేసీ చేతులు దులుపుకుంది. రికార్డుల్లో ఇంటి నిర్మాణం పూర్తయినట్లు చూపించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇంటి లోపల గోడలకు ప్లాస్టింగ్ చేయలేదు. ఫ్లోర్ వేయలేదు. విద్యుత్ సరఫరా ఇవ్వలేదు. స్నానపు గదులు, మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. వీటిని లబ్దిదారుడు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. అంటే లబ్ధిదారుడు రూ.1.50 - రూ.2 లక్షలకు పైగా అదనంగా భరించాల్సి వస్తుంది. దీనికితోడు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యం లేకపోవడంతో పేదలు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఆదోని శివారులో డాణాపురం దగ్గర ఆదోని పట్టణ ప్రజలకు 6,495 ఇళ్లు నిర్మాణాలు మొదలు పెట్టి 4,286 ఇళ్లు పూర్తి చేశామని రికార్డుల్లో చూపుతున్నారు. ఇప్పటికే రూ.100.14 కోట్లు ఖర్చు చేశారు. అక్కడ కూడా నాలుగు గోడలు, ఆర్సీసీ స్లాబ్ వేసి వదిలేశారు. ఎమ్మిగనూరు, ఆదోని పట్టణాల్లో ఒక్కటే కాదు.. కర్నూలు నగరం సహా ముప్పాతిక శాతం గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది.
ఇసుక గూళ్లు!
గత జగన్ ప్రభుత్వ హయాంలో ఆప్షన్-3 కింద ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణాల్లో దాదాపు 10,138 ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లకు అప్పగించారు. 85 శాతానికి పైగా పనులు పూర్తి చేశామని ఆ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థలు చెబుతున్నాయి. ఆ సంస్థలకు రూ.77-80 కోట్లకుపైగా బిల్లులు చెల్లించారు. లబ్ధిదారులు కుటుంబంతో నివాసం ఉండేదుకు వీలుగా ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. నాలుగు గోడలు కట్టి, ఆర్సీసీ స్లాబ్ వేసి, బయట గోడలకు ఒక్కటే సిమెంట్ ప్లాస్టింగ్ చేసి వదిలేశారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యమైన సిమెంట్ ఇటుకలు వాడలేదని తెలుస్తోంది. నాణ్యతాప్రమాణాలపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లో చెప్పిన ఆయన ఇప్పటికీ చర్యలు లేవు. థర్డ్పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లతో తనిఖీ చేయించాలని, నాణ్యతాప్రమాణాలు విస్మరించినట్లు తేలితే కాంట్రాక్ట్ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
లక్ష్యం మేరకు పురోగతి
కర్నూలు జిల్లాలో పేదలకు 53,967 ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 50,032 ఇళ్లు నిర్మాణాలు మొదలు పెట్టి 29,408 ఇళ్లను పూర్తి చేశాం. వివిధ దశల్లో ఉన్న ఇళ్లలో 11,706 ఇళ్లును పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కర్నూలు కలెక్టరు పి.రంజిత్బాషా క్రమం తప్పకుండా పురోగతిపై సమీక్షిస్తున్నారు. గడువులోగా నిర్మాణాలు పూర్తి పేదలకు అప్పగిస్తాం.
- చిరంజీవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, గృహ నిర్మాణ శాఖ, కర్నూలు
పీఎంఏవై (అర్బన్, గ్రామీణ) ఇళ్ల పురోగతి వివరాలు
వివరాలు అర్బన్ గ్రామీణ మొత్తం
మంజూరు చేసిన ఇళ్లు 39,440 14,527 53,967
నిర్మాణాలు మొదలైనవి 39,410 10,622 50,032
పూర్తైన ఇళ్లు 24,766 4,642 29,408
వివిధ దశల్లో ఉన్నవి 14,731 5,980 20,711
చేసిన ఖర్చు (రూ.కోట్లల్లో) 533.58 68.11 601.69