ఒప్పందం కుదిరాక పొగాకు సాగు చేయండి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:37 PM
పొగాకు కంపెనీలతో ఒప్పందం కుదిరాక మాత్రమే రైతులు పొగా కును సాగుచేయాలని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి అన్నారు.
వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పొగాకు కంపెనీలతో ఒప్పందం కుదిరాక మాత్రమే రైతులు పొగా కును సాగుచేయాలని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పొగాకు పంటకు సంబంధించి రైతులతో కంపెనీ ప్రతినిధులు ఎంవోయూ చేసుకొని ఆప్రతులను రైతులకు అందిం చాలని, ఇటీవలే కలెక్టర్ ఆదేశించినట్లు జేడీ తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో హెచ్డీబీఆర్జీ, హెచ్డీబార్లీ, బ్లాక్బర్లి రకాల పొగాకు సాగును ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందన్నారు. రైతులు ఆ రకాల పంట సాగును రైతులు చేపట్టకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమను ఆదేశించినట్లు జేడీ వరలక్ష్మి స్పష్టం చేశారు. నవంబరు 30వ తేదీకి పొగాకు కంపెనీలు రైతులతో తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాలని ఆదేశించారు. పొగాకు సాగుకు సంబంధించిన టాస్క్ఫోర్స్ కమిటీలు డివిజన్, మండల స్థాయిలోని అధికారులు ఈ విధమైన చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీల్లో రైతుల తరుపున ఒకరు సభ్యులుగా ఉండాలని, తద్వారా రైతులకు ఏవైనా సమస్యలుంటే సమా వేశాల్లో వారి ఇబ్బందులను తెలుసుకోవడానికి అధికార యంత్రాంగానికి వీలవుతుందన్నారు.