ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:36 AM
ఎన్నికల హామీ ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి అయినా అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఏఐవైఎఫ్ నాయకుల డిమాండ్
పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య తోపులాట
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీ ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి అయినా అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐవైఎఫ్ కార్యకర్తలు, నిరుద్యోగులు వినూత్న రీతిలో అర్ధనగ్న ప్రదర్శనతో ఖాళీ ప్లేట్లతో నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో సంపాదన సృష్టించి 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఇస్తామని, అందుకు ప్రణాళిక కూడా సిద్ధ చేశామని బహిరంగంగా ప్రకటించి నిరుద్యోగ ఓట్లతో గద్దెనెక్కి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్ను కలిసేందుకు కలెక్టరేట్ గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కంచెను ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న, ఏఐటీయూసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, పెద్దయ్య, రంజిత్గౌడు, జాఫర్పటేల్, నాగరాజు, నాయకులు నిరుద్యోగులు పాల్గొన్నారు.