బాలికలు బాగా చదువుకోవాలి
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:01 PM
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని బాలికలు బాగా చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి విద్యార్థినులకు సూచించారు.
మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని బాలికలు బాగా చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి విద్యార్థినులకు సూచించారు. నంద్యాలలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా మంత్రి కలెక్టర్ రాజకుమారితో కలిసి నంద్యాల గిరినాథ్ సెంటర్లో సాంఘిక సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. బాలికలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఒక్కో గదిలో ఎంతమంది ఉంటున్నారు? గదులు ఈ రోజు మాత్రమే శుభ్రంగా ఉన్నాయా?, రోజూ శుభ్రం చేస్తున్నారా?, మెనూ సక్రమంగా అమలవుతోందా? అని మంత్రి బాలికలను అడిగారు. అనంతరం వారితో పాటే కూర్చుని భోజనం చేశారు. మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థుల భవితకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించి కృషి చేస్తున్నారని అన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఏ మాత్రం అసౌకర్యం కల్పించినా ఉపేక్షించబోమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ వసతి గృహాల్లో ఉంటే ఎలాంటి ఖర్చులు లేకుండా అన్ని సౌకర్యాలతో పాటు మంచి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని అన్నారు.