జీడీపీ వెలవెల
ABN , Publish Date - Jun 19 , 2025 | 11:26 PM
మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)లో నీరు లేక వెలవెలబోతోంది. రోజురోజుకూ ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతున్నాయి.
ప్రాజెక్టులో అడుగంటుతున్న జలాలు
గోనెగండ్ల, జూన్ 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)లో నీరు లేక వెలవెలబోతోంది. రోజురోజుకూ ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతున్నాయి. ప్రస్తు తం ప్రాజెక్టులో 1.1 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 4.5 టీఎంసీలు. గతంలో జూన్ చివరి నాటికి ప్రాజెక్టులో వరద వచ్చి సంవృద్ధిగా చేరేది. దాదాపు 2 టీఎంసీలకు తగ్గేదికాదు. రెండుళ్లుగా జూన్ నెల చివరి తేదీ వచ్చినప్పటికి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురియక పోవడంతో ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరడం లేదు. ఈకారణంగా ప్రాజెక్టు నీరు లేక వెలవెల పోతుంది. ఈ ప్రాజెక్టు కింద డోన్, పత్తికొండ, క్రిష్టగిరి తాగునీటి పథకాలకు నీరు సరఫరా అవుతుంది. దాదాపు 120 గ్రామా లకు ప్రాజెక్టు నీరే తాగునీటి కింద సరఫరా అవుతున్నాయి. అవసర సమయంలో కర్నూ లు, కోడుమూరు, లద్దగిరి, గూడురు, బెళగల్ ప్రాంతాలకు కూడా సరఫరా అవుతాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్ననీటితో తాగునీటి పథకాలకు డోకా లేదని అధికారులు తెలుపు తున్నారు. గత ఏడాది వర్షపునీరు చెప్పుకోదగ్గ స్థాయిలో రాకపోయినప్పటికి హెచ్ఎన్ఎస్ నీరు(శ్రీశైలం బ్యాక్ వాటర్)వచ్చి ప్రాజెక్టు కు చేరడంతో ఈ ఏడాది ప్రాజెక్టు కింద దాదాపు 13000 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రాజెక్టులో వరద వచ్చి చేరితేనే ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములు వచ్చే రబీ సీజన్లో పంట సాగుతో కళకళలాడుతాయి. కాగా ప్రతి రోజు ప్రాజెక్టులోని నీటి నుంచి 30 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. వర్షం కోసం రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదైనా వర్షాలు కురిసి ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతుందో లేదో వేచిచూడాలి.