గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:39 PM
ఈ నెల 27 నుంచి వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
నేర సమీక్షలో ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 27 నుంచి వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. గురువారం కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరి యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు పోలీసు బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు ఆన్లైన్లో ‘గణేశ్ ఉత్సవ్.నెట్’’ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈమేరకు స్థానిక పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు అనుగు ణంగా ఉన్న మండపాలకు అనుమతులిస్తారని చెప్పారు. పెద్ద వినాయక విగ్రహ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. అలాగే మండపాల వద్ద భక్తి పాటలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉండాలన్నారు. హోరెత్తించే పెద్ద శబ్దాలతో ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదన్నారు. సెప్టెంబరు 4న నిమజ్జనం ఉంటుందని, అందుకు తగ్గ బందోబస్తు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్ఎస్లో డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రతి సబ్ డివిజన్కు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ టీమ్లు, క్రైం స్పాట్ వాహనాలు త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే వాట్సాప్ ద్వారా మెయిల్ ఐడీగానీ, రిజిస్టర్ పోస్టుల ద్వారా పోలీసులకు ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారించి కేసులు నమోదు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా డిజిటల్ సైన్ బోర్డులు, హోర్డింగ్స్ వంటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. కార్డన్ సెర్చ్లు, వాహనాల తనిఖీ తరుచుగా చేయాలన్నారు. శాంతిభద్రతకు తీవ్రమైన నేరాలకు పాల్పడే హిస్టరీ షీట్స్ ఉన్న వారిని జిల్లా బహిష్కరణ కోసం పీడీ యాక్టుల సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్తగా వచ్చిన ప్రొబేషనరీ ఎస్ఐలు ప్రతి కైం మీటింగ్ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కోర్టులో పెండింగ్ కేసులను త్వరగా ట్రయల్కు వచ్చేలా కృషి చేయాలన్నారు. అనంతరం గత నెలలో కేసులలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, హేమలత, భార్గవి, సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.