Share News

గంగ ఒడికి గణపయ్య

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:03 AM

వినాయక నిమజ్జనం అంటేనే సందడి. ఐక్యతకు నిర్వవచనం. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా బొజ్జ గణపయ్యను సాదరంగా సాగనంపడానికి ఉత్సాహం చూపుతారు.

గంగ ఒడికి గణపయ్య
నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథులు

ఉత్సాహంగా గణేశ శోభాయాత్ర

యువత నృత్యాల జోరు.. డీజేల హోరు

కిక్కిరిసిన నగర రహదారులు

కర్నూలు కల్చరల్‌/న్యూసిటీ/ అర్బన్‌/ కల్లూరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జనం అంటేనే సందడి. ఐక్యతకు నిర్వవచనం. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా బొజ్జ గణపయ్యను సాదరంగా సాగనంపడానికి ఉత్సాహం చూపుతారు. వినాయక చవితి సందర్భంగా కర్నూలు నగరంలో 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు గురువారం నిమజ్జనానికి తరలివెళ్లాడు. వాహనాల మీద ఆశీనుడైన గణనాథుడి ఊరేగింపు ఎదుట పిల్లలు, పెద్దలు ఆనందంతో చిందులు వేశారు. డీజే సౌండ్స్‌ దద్దరిల్లాయి. అనంతరం భక్తి శ్రద్ధలతో విగ్రహాలను కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. గణేశ నిమజ్జనోత్సవం సందర్భంగా వినాయక ఘాట్‌ను శుభ్రంగా తీర్చిదిద్దిరు. కెనాల్‌కు అటూ, ఇటూ రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కెనాల్‌ వెంట అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుద్ధీప కాంతుల్లో ఘాట్‌ను వెలిగిపోయింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రాంబొట్ల దేవాలయం నుంచి వినాయక ఘాట్‌ వరకు తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నదానం, అల్పాహారం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రతిష్టించిన 8 అడుగుల మట్టి విగ్రహన్ని నిమజ్జనం చేశారు. కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ నృత్యాలు చేసి అందరిని ఉత్సాహపరిచారు. వీరితో పాటు అధికారులు, యువత కలిసి డాన్సులు వేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ చిన్నరాముడు, డిప్యూటీ కమిషనర్‌ సతీ్‌షకుమార్‌రెడ్డి, మెడికల్‌ హెల్త్‌ అధికారి కె.విశ్వేశ్వర రెడ్డి, సిటీ ప్లానర్‌ ప్రదీ్‌పకుమార్‌, ఇనఛార్జి ఎస్‌ఈ శేషసాయి తదితరులు పాల్గొన్నారు.నగరంలోని కేఈ ప్లాజా వద్ద ఈడిగ, గౌడ్‌ సంక్షేమం సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు కేఈ విజయ్‌కుమార్‌ గౌడ్‌, కాసాని మహేష్‌ గౌడ్‌, సురేష్‌ పాల్గొన్నారు. నగరంలోని 19, 20 వార్డుల్లోని వినాయక మండపాలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గురువారం సందర్శరించారు. పలు కాలనీల్లో వినాయక విగ్రహాలకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆమ వెంట ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, నాయకులు ప్రభాకర్‌యాదవ్‌, పెరుగు పురుషోత్తంరెడ్డి, నాగిరెడ్డి ఉన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 01:03 AM