Share News

మే16న ఉచిత సామూహిక వివాహాలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:12 AM

మే నెల 16వ తేదీన వివాహాలు చేసుకునే జంటలకు రూ.80 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు మాజీ టీజీ వెంకటేశ్‌ బుధవారం తెలిపారు.

మే16న ఉచిత సామూహిక వివాహాలు
మాట్లాడుతున్న టీజీ వెంకటేశ్‌

అర్హులైన వధూవరులకు రూ.80 వేలు ఆర్థిక సాయం

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌

కర్నూలు స్పోర్ట్స్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): మే నెల 16వ తేదీన వివాహాలు చేసుకునే జంటలకు రూ.80 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు మాజీ టీజీ వెంకటేశ్‌ బుధవారం తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అప్లికేషన్ల కోసం కర్నూలు నగరంలోని మౌర్యఇన్‌లోని కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. తన జన్మదినం సందర్భంగా గత 30 ఏళ్లుగా సామూహిక వివాహాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. వివాహం చేసుకునే వధూవరుల్లో ఒకరు కర్నూలు నియోజకవర్గ పరిధిలో గానీ, పంచలింగాల, ఈ-తాండ్రపాడు, గొందిపర్ల, పూలతోట, దేవమాడ, దొడ్డిపాడు గ్రామాలకు చెందిన వారై ఉండాలని తెలిపారు. అన్ని కులాల వారు, ముస్లిం, క్రైస్తవులు అర్హులని చెప్పారు. దరఖాస్తు చేసుకునే వారు తమకు ఎటువంటి దురలవాట్లు లేవని, భవిష్యత్తులో కూడా చెడు అలవాట్లకు బానిసలు కాబోమని డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. నూతన వధూవరులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేజర్లు అయి ఉండాలని, వారికి నగదు పారితోషికంతో పాటు తాళిబొట్టు, కాలి మెట్టలు, పట్టువస్త్రాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో దాశెట్టి శ్రీనివాసులు, వాయుగండ్ల సుబ్బారావు, కే.రామస్వామి, శ్రీకాంత్‌, బాలయ్య, పాల్‌రాజ్‌, హర్షవర్దన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:12 AM