మాజీ ఎమ్మెల్యే..మార్క్ రాజకీయం
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:07 PM
ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి మార్క్ రాజకీ యం కొనసాగుతోంది. కూటమి నేతల్లో కలకలం రేపుతోంది.
కూటమిలో కలకలం
ఎంపీపీపై అవిశ్వాసానికి సిద్ధం
నాడు మున్సిపల్ చైర్మన్.. నేడు ఎంపీపీ
ఆదోని రూరల్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి మార్క్ రాజకీ యం కొనసాగుతోంది. కూటమి నేతల్లో కలకలం రేపుతోంది. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి వైసీపీ సిద్ధమైంది. సాయికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న నాగేంద్ర భార్య బోయ శాం తను మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆమె వైసీపీలోనే ఉండగా నాగేంద్ర మాత్రం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారఽథి పంచాన చేరారు. సాయి ప్రసాద్రెడ్డి తన మార్క్ రాజకీయంతో వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్ల బలం ఉండడంతో నాలుగు నెలల క్రితం మున్సిపల్ చైర్మన్ శాంతపై అవిశ్వాసం పెట్టారు. ఆమెను దించి వైసీపీ కౌన్సిలర్ లోకేశ్వరిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు.
సబ్ కలెక్టర్ను కలిసి..
అవినీతికి పాల్పడుతుందని తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, దానమ్మను దించడానికి అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ ఎంపీటీసీలు 19మంది మంగళ వారం సబ్ కలెక్టర్ మౌర్య భర ద్వాజ్ను కలిసి విన్నవించారు. ఎంపీపీ దానమ్మ 2021 సెప్టెంబరు 24న ప్రమాణస్వీకారం చేశారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కచ్చితంగా నాలుగేళ్లు పూర్తికావాలని సబ్ కలెక్టర్ సూచించారు. బుధవారంతో నాలు గేళ్లు పూర్తవుతాయని, రేపు వస్తామని వారు వెళ్లిపోయారు.
ఓటు వేసే హక్కు ఉండదు
పంచాయతీ చట్టం 1994 ప్రకారం ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టి నూతనంగా ఎంపిపిని ఎన్నుకునే క్రమంలో ఎంపీటీసీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యే ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చుగాని, ఓటు వేసే హక్కు ఉండదు. ప్రస్తుతం ఆదోని ఎంపీటీసీల్లో మెజార్టీ శాతం వైసీపీ వారే. ఏది ఏమైనా అవిశ్వాసంలో కూడా తానే నెగ్గుతానని ఎంపీపీ దానమ్మ సవాల్ విసురుతోంది.