ఐదు మండలాలతో కలిపి ఏర్పాటు
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:49 PM
జిల్లాలో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.
నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ
30 రోజుల్లో అభ్యంతరాలు
ఆనందంలో ఆయా మండలాల ప్రజలు
నంద్యాల, నవంబరు27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. గురువారం ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదు మండలాలతో( బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల) కలిపి కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో నేటి నుంచి 30 రోజుల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు తెలియజేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆతర్వాత కలెక్టర్ రాజకుమారి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి అందజే యనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే జిల్లాలో నంద్యాల, ఆత్మకూరు, డోన్ రెవెన్యూ డివిజన్లు ఉండగా.. కొత్తగా బనగానపల్లె డివిజన్తో మొత్తంగా జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు కానున్నాయి. ఏది ఏమైనా కొత్త రెవెన్యూ డివిజన్ ప్రకటనతో ఆ ఐదు మండలాల ప్రజల్లో ఆనందోత్సవం మొదలైంది.