గోనె సంచులకు నిప్పు
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:24 AM
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక ఉన్న గోడౌన్ల వద్ద బుధవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచులకు నిప్పు పెట్టారు. దీంతో ఆ ఖాళీ సంచులు కాలి బూడిద య్యాయి.
రూ 5.5 లక్షల దాకా నష్టం
పరిశీలించిన టీడీపీ నాయకులు
ఎమ్మిగనూరు టౌన్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక ఉన్న గోడౌన్ల వద్ద బుధవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచులకు నిప్పు పెట్టారు. దీంతో ఆ ఖాళీ సంచులు కాలి బూడిద య్యాయి. వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపిన వివరాలివీ.. మార్కెట్ వెనుక వైపున 8 గోడౌన్లు ఉన్నాయి. ఇందులో కొంత మంది వ్యాపారులు ఖాళీ సంచులు వేసుకొని తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే 500 ఖాళీ సంచుల గట్టాలు (25 వేలకుపైగా ఖాళీ సంచులు) తెచ్చుకొని పెట్టుకున్నారు.బుధవారం తెల్లవారుఝామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించగా మంటలు ఎగసి పడుతుండటంతో అక్కడ సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్ వారు, వ్యవసాయ మార్కెట్ అధికారులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికీ మంటలు అదుపు కాకపోవడంతో, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి అదుపు చేశారు. అప్పటికే భారీగా నష్టం జరిగింది. ఫైర్ స్టేషన్ సీఐ రామాంజనేయులు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని, వీరేష్కు రూ.50 వేలు, మహబూబ్ బాషాకు రూ.5 లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. సమాచారం అందుకున్న మార్కెట్ యార్డు సెక్రటరీ చంద్రమౌళి, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, టీడీపీ సీనియర్ నాయకులు భాస్కర్ల చంద్రశెఖర్, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.