వక్ఫ్ బోర్డు చట్ట సవరణ రద్దుకు పోరాడదాం
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:09 AM
ముస్లింలందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా పోరాడి వక్ఫ్ బోర్డు చట్ట సవరణను రద్దు చేసుకుందామని తెలంగాణ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
కర్నూలు న్యూసిటీ, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ముస్లింలందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా పోరాడి వక్ఫ్ బోర్డు చట్ట సవరణను రద్దు చేసుకుందామని తెలంగాణ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. సోమవారం ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు సేవ్ వక్ఫ్ సేవ్ కాన్సిటెన్సీ జేఏసీ ఆధ్వర్యంలో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ మౌలానా షోయబ్ సాబ్ అధ్యక్షతన జరిగింది. సభకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు అధ్యక్షుడు ఖాళీద్ షఫీఉల్లా రహమాని, జమా అతే అహలే హదీస్ అధ్యక్షుడు అబ్దుల్ రహిం ఖురామ్ హాజరయ్యారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు అధ్యక్షుడు ఖాళీద్ షఫీఉల్లా రహమాని మాట్లాడుతూ ముస్లిం సమాజం ఇతర ప్రజలను దళితులను, మైనార్టీలను, సెక్యులర్ వాదులను, రాజ్యాంగ ప్రేమికులను, న్యాయ నిపుణులను, కలుపుకుని ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉంద న్నారు. సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ముస్లిం హక్కులను కాలరాసే విధంగా చట్టాలను తీసుకువస్తుందన్నారు. ఈ దేశంలో ముస్లింలు తక్కువ జనాబా కలిగి ఉన్నారనే భానను తొలగించుకోవాలని ఒక ఇరాన్, పాకిస్తాన్ కంటే కూడా ఈ దేశంలో ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఉన్నారని అన్నారు. ఢిల్లీలో రైతులు చేసిన ఆందోళనలకు ప్రధాని నరేంద్ర మోదీ మూడు చట్టాలను రద్దు చేసి అందరికీ క్షమాపణ చెప్పిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. సభలో జావలి సాహెబ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, హఫీజ్ఖాన్., సయ్యద్ షా ఫషీ ఫాషా సాహెబ్, ముక్తి సయ్యద్ మన్సూర్ సాహెబ్, ఎస్డీపీఐ రాష్ట్ర అద్యక్షుడు అబ్దుల్ ఖాన్, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.