ఈఎంఐలు స్వాహా
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:15 PM
రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్మాల్ చేసింది మార్కెటింగ్ సిబ్బంది.
సుమారుగా రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు
కొటక్ మహేంద్ర బ్యాంకు ఎదుట రైతుల నిరసన
పరారీలో మార్కెటింగ్ సిబ్బంది
లబోదిబోమంటున్న బాధితులు
నంద్యాల టౌన్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్మాల్ చేసింది మార్కెటింగ్ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ పక్కనే ఉన్న కొటాక్ మహేంద్ర బ్యాంకు ఉంది. ఇటీవలే కొంత మంది రైతులు ఈబ్యాంకులో ఫైనాన్స్ మీద ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. రైతులు ఆరు నెలలకు ఒక్క కంతు సుమారుగా రూ75 వేల నుంచి రూ.1లక్ష వరకు చేసుకుని మొదటి నెల కట్టారు. రెండో నెల మొత్తాన్ని సుమారుగా 2 మంది రైతుల దగ్గర నుంచి ఉదయ్ కుమార్, అస్లాం, అనిల్ అనే బ్యాంకు మార్కెటింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులు వారి వ్యక్తిగత ఖాతాకు వేయిం చుకుని బ్యాంకులో కట్టకుండా తిరుగుతున్నారు. ఇటీవల బాధిత రైతులందరికి హెడ్ ఆఫీసు నుంచి మీరు లోన్ అమౌంటు కట్టలేదని కట్టాలని చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియక రైతులు శుక్రవారం బ్యాంకుకు వచ్చి విచారణ చేయగా అక్కడ వారు లేరు. మాడబ్బులు వెనక్కి ఇవ్వాలని రైతులు అడగగా మాకు సంబంధం లేదని చెప్పడంతో బాధితులందరూ బ్యాంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చాలా మంది రైతులు అప్పులు చేసి మరి కంతులు చెల్లిస్తే ఇలా చేయడంతో లబోదిబో మంటు న్నారు. వన్టౌన్ పోలీసులను సంప్రందించగా వారు మాకు ఏం తెలియదు మీరు వెళ్లి బ్యాంకు వారితోనే మాట్లాడుకోండి అని అంటున్నార ని బాధితులు తెలిపారు.
అధికారులు న్యాయం చేయాలి
రెండు నెలల నుంచి కంతులు కట్టలేదని పై నుంచి ఫోన్ వస్తుంది. బ్యాంకు కు వచ్చి అడగగా మాకు తెలియదు అంటున్నారు. సుమారుగా రూ.2లక్షల వరకు ఫోన్పే చేయించుకుని కట్టకుండా వెళ్లిపోయారు. అధికారులు మాకు న్యాయం చేయాలి.
సుధాకర్రెడ్డి, బాధిత రైతు, పెద్దకొట్టాల