ఎల్లెల్సీకి ముందస్తు సాగునీరు
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:59 PM
తుంగభద్ర జలాశయం నీటి నిల్వ 62 టీఎంసీలు దాటిపోయింది. వరద ఉధృతి 63,816 క్యూసెక్కులు. మరో రెండు రోజుల్లో 80 టీఎంసీలకు నీటి నిల్వ చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఖరీఫ్కు మాత్రమే
పనులు పూర్తి చేయాలని బోర్డు అధికారుల ఆదేశం
హాలహర్వి, జూన్28(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయం నీటి నిల్వ 62 టీఎంసీలు దాటిపోయింది. వరద ఉధృతి 63,816 క్యూసెక్కులు. మరో రెండు రోజుల్లో 80 టీఎంసీలకు నీటి నిల్వ చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జలాశయంలో 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకుని, మిగతా వరద నీటిని నదికి విడుదల చేసేందుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఈ యేడాది మే నెలలోనే ఇన్ఫ్లో ప్రారంభం కావడంతో జూన్ ఆఖరికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరబోతుంది. కానీ క్రస్ట్గేట్లు శిథిలావస్థకు చేరుకోవడంతో జలాశయం నీటి నిల్వ 80 టీఎంసీలకు మించకూడదనే బోర్డు అధికారుల నిర్ణయంతో ఈసారి ముందస్తుగానే కాలువకు నీరు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర జలవనరుల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఏఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. కర్నూలు జిల్లాలో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎల్లెల్సీ కాలువకు ముందస్తుగా సాగునీరు అందుతుంది. ముందస్తుగా సాగునీరు విడుదలవుతున్న నేపథ్యంలో సీసీ లైనింగ్ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై బోర్డు అధికారులు ఒత్తిడి పెంచారు. దీంతో పనులు వేగవంతం అవుతున్నాయి. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు ఉండగా, ప్రస్తుతం 1622 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 63,816 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా అవుట్ ఫ్లో 200 క్యూసెక్కులుగా ఉంది.