ఎండుతున్న పంటలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 01:02 AM
మండలంలో గత పది రోజుల నుంచి అడప దడప తేలికపాటి చినుకులే తప్ప చెప్పుకోదగ్గ భారీ వర్షాలు కురువక పోవడంతో రైతులు సాగుచేసిన మొక్కజొన్న, సోయాబీన్, పత్తి తదితర పంటలు ఎండుముఖం పట్టాయి.
ఆందోళనలో రైతులు
పాములపాడు, ఆగస్టు 3 (ఆంధ్ర జ్యోతి):మండలంలో గత పది రోజుల నుంచి అడప దడప తేలికపాటి చినుకులే తప్ప చెప్పుకోదగ్గ భారీ వర్షాలు కురువక పోవడంతో రైతులు సాగుచేసిన మొక్కజొన్న, సోయాబీన్, పత్తి తదితర పంటలు ఎండుముఖం పట్టాయి. దీంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. ఈ ఏడాది మే, జూన్ మాసంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు దుక్కిదున్ని విత్తనాలు వేసి పంటలు సాగుచేశారు. మండలంలోని చెలమిల్ల, లింగాల, ఇస్కాల, రుద్రవరం, జూటూరు. క్రిష్ణరావుపేట, పాముల పాడు, ఎర్రగూ డూరు, బానుముక్కల మట్ట కందాల తదితర గ్రామాలలో దాదాపు 7వేల హెక్టార్లలో మొక్కజొన్న, 2వేల హెక్టార్లలో పత్తి, సోయాబీన్ పంటలను సాగు చేశారు. దాదాపు 45 రోజుల క్రితం పంటలను నాటారు. ఇప్పటివరకు పెద్దగా వర్షాలు పడకపోవడంతో రుద్రవరం, భానుముక్కల తదితర గ్రామాలలో పంటలను దున్ని వేశారు. మరో ఐదురోజుల నుంచి పది రోజుల్లో వర్షాలు పడకుంటే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురవాలని రైతులు కోరుతున్నారు