మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టాలి
ABN , Publish Date - May 24 , 2025 | 12:35 AM
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా అరికట్టా లని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా అరికట్టా లని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం ‘నషా ముక్తభారత్ అభియాన్’ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సమావేశంలో ఏడీ డిజేబుల్డ్ రయిస్ ఫాతిమా, లీగల్ సెల్ అడ్వకేట్ హేమలత, మెప్మా పీడీ నాగ శివలీల, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో డా.శాంతికళ, ఐసీడీఎస్ పీడీ నిర్మల, డీఈవో శామ్యూల్పాల్, డీఎస్పీ బాబుప్రసాద్ పాల్గొన్నారు.
జూన్ 1 నుంచి 7 వరకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. జూన్ 8 నుంచి జూన్ 14 వరకు వాల్ పెయింటింగ్స్, పోస్టర్లు తయారు చేయించి యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లలో విస్తృతంగా ప్రచారం చేయాలని, జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జూన్ 15 నుంచి 21వ తేదీ వరకు చర్చలు, కాంపీటీషన్స్, సెమినార్లు, వెబ్నార్లు నిర్వహించాలని ఆర్ఐవో, డీవీఈవోలను ఆదేశించారు. జూన్ 22 నుంచి 26 వరకు కర్నూలు మున్సిపల్ కమిషనర్, కమ్యూనిటీ మెంబర్స్, స్వచ్ఛంద సంస్థల ద్వారా అవగాహన ర్యాలీలు, సంతకాల సేకరణ, బైక్ ర్యాలీలు తదితర కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 26న ప్రతి కార్యాల యంలో, ప్రతి స్కూల్, కాలేజీ, యూనివర్సిటీలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.