దేశ రక్షకులు..
ABN , Publish Date - May 10 , 2025 | 12:29 AM
దేశ రక్షకులు..

‘ఆపరేషన్ సిందూర్’లో కోసిగి సైనికులు
దేశ భద్రతే లక్ష్యంగా సైన్యంలోకి
సరిహద్దులో పాక్తో వీరోచిత పోరాటం
జమ్మూకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న చింతకుంట యువకులు
కోసిగి, మే 9 (ఆంధ్రజ్యోతి): దేశ సేవలో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దేశ ప్రజల ప్రాణాలకు వారి ప్రాణాలను పణంగా పెట్టడంతోనే స్వేచ్ఛగా జీవిస్తున్నాం. భారతదేశ రక్షణలో ముందుండే ఆర్మీ వ్యవస్థ నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ మనకు స్వేచ్ఛా వాయువులు ఇస్తున్న జవాన్ల త్యాగం అనిర్వచనీయం. ఎండ, చలి, వర్షం ఇలా ఏదీ లెక్క చేయకుండా అహర్నిశలు సంసిద్ధులై శత్రుదేశాల బారి నుంచి రక్షించే నిజమైన యోధులు మన సైనికులు. 24 గంటల పాటు దేశ సరిహద్దులో ఉంటూ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణలో తరిస్తున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా శత్రువుల తుపాకుల నుంచి వచ్చే బుల్లెట్లు, బాంబుల మోతలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అత్యంత క్లిష్ట సమయాల్లో నిత్యం ప్రాణసంకటంగా జీవితాన్ని గడిపే వీర జవాన్లే మన ధైర్యం. అలాంటి సైన్యంలో కర్నూలు జిల్లా నుంచి కూడా ఎంతోమంది యువకులు సేవలందిస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలో ఉన్న కోసిగి మండలంలోని మారుమూల గ్రామాల నుంచి యువకులు ఆర్మీలో ఉంటూ దేశ సేవలో తరిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దులో జరుగుతున్న ‘ఆపరేషన్ సిందూర్’లో ప్రాణాలను అడ్డుపెట్టి శత్రుదేశం పాకిస్థాన్ దాడులను తిప్పికొడుతున్నారు.
తమ కుటుంబాలను దేశ సరిహద్దులో విడిచి రాత్రింబవళ్లు అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్నారు కోసిగి మండలంలోని మారుమూల గ్రామాల యువకులు. మండలంలోని దేవరబెట్ట, చిన్నభోంపల్లి, జంపాపురం, చింతకుంట, సజ్జలగుడ్డం, తదితర గ్రామాల నుంచి సుమారు 30 మందికి పైగా సైనికులు దేశం రక్షణ కోసం ప్రాణాలు సైతం అడ్డు పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. చింతకుంట గ్రామానికి చెందిన సైనికులు ప్రస్తుత ఇండో-పాక్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల్లో ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి ఉగ్రమూకలను ఎదుర్కొంటున్నారు. కోసిగి మండల పేరుతో పాటు సొంతూరు, తల్లిదండ్రుల పేరును నిలబెట్టే దిశగా సామాన్య కుటుంబం నుంచి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి దేశ సేవ కోసం ఆర్మీ పోలీసులుగా ఎంపికై దేశ సేవలో తరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఒకే ఇంటి నుంచి ఇద్దరు
కోసిగి మండలం సజ్జలగుడ్డం పంచాయతీలోని దేవరబెట్ట గ్రామంలో తలారి గోపాల్, మల్లీశ్వరిలకు ఇద్దరు కుమారులు. వీరిలో తలారీ విష్ణు రాజస్థాన్లోని ఇంటర్నేషనల్ బార్డర్లో విధులు నిర్వహిస్తుండగా.. తలారీ విశ్వనాథ్ అస్సాంలోని లేఖ్ఫణి హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే ఇంట్లో తమ ఇద్దరు కుమారులు దేశసేవకు వదలడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు తలారి గోపాల్, మల్లీశ్వరి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చింతకుంట నుంచి ఏడుగురు
చింతకుంట గ్రామం నుంచి ఏడుగురు సైనికులు దేశ సేవలో విధులు నిర్వహిస్తున్నారు. జల్లా మహాదేవ్, నెంగి రాఘవేంద్ర, జుమాల మారయ్య, నెంగి మాధవరెడ్డి, హనుమయ్యగారి వీరేంద్ర, కప్ప శ్రీనివాసులు, బద్రి ఆంజనేయ, చిన్నభోంపల్లి గ్రామానికి చెందిన కేబీ మల్లికార్జున దేశ సరిహద్దులోని వివిధ ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. ప్రస్తుతం వీరందరూ ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్నట్టు సమాచారం.
జంపాపురం నుంచి ఆరుగురు
జంపాపురం గ్రామానికి చెందిన గుడ్డేగారి బసవరాజు, నరసింహారెడ్డి, తిరుమల్ రెడ్డి, రాజేష్, కోసిగయ్య, రాఘవేంద్ర రెడ్డి... మొత్తం ఆరుగురు దేశ సరిహద్దులో రక్షణ విధులు నిర్వహిస్తున్నారు. ఒకే గ్రామం నుంచి ఆరుగురు దేశ సేవలో ఉండటం తమ గ్రామానికే గర్వకారణమని అక్కడి ప్రజలు సగర్వంగా చెబుతున్నారు.
దేశ రక్షణకు ప్రాణాలైనా అర్పిస్తా
నాకు సైనికదళంలో ఉద్యోగం వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతోంది.
నా సొంత తమ్ముడు కూడా సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఒకే ఇంట్లో నుంచి అన్నదమ్ములు
దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం.
మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే దేశ సేవలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా.
- దేవరబెట్ట తలారి విష్ణు
దేశ రక్షణకే జీవితం
నాకు 22 ఏళ్ల వయసులోనే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్నా. దేశ రక్షణ కోసం జీవితాంతం పని చేయడానికి సిద్ధంగా ఉంటా. సొంత ఊరికి, తల్లిదండ్రులకు పేరుప్రఖ్యాతలు తీసుకురావడమే నా ధ్యేయం. పాక్ దురాగ తాలను సమర్థవంతంగా ఎదుర్కొవడవే లక్ష్యం.
- రాఘవేంద్రరెడ్డి