పాక్పై యుద్ధం ప్రకటించాలి
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:39 AM
ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలని హిందూ పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు.
హిందూ పరిరక్షణ వేదిక నేతల డిమాండ్
కర్నూలులో వీహెచ్పీ, అనుబంధ సంస్థల భారీ ర్యాలీ
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలని హిందూ పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. కశ్మీర్లోని ఫెల్గావ్లో హిందువులపై జరిగిన నరమేధాన్ని తీవ్రంగా నిరసిస్తూ వీహెచ్పీ, అనుబంధ సంఘాలు హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని జడ్పీ కార్యాలయం ఎదుట మహాత్ముడి విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి, ఉగ్రవాదులకు బలి అయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మహాత్ముడి విగ్రహం ఎదుట నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఫెల్గావ్లో జరిగిన ఉగ్రమూకల దాడి హృదయ విదారకంగా ఉందని, ఉగ్రమూకలు ఆధార్ కార్డులు వెతికి, కల్మా చదవమని, చదవని వారిని దారుణంగా తుపాకులతో కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. ఈ నరమేధం వెనుక అనేక కుట్ర కోణాలు ఉన్నాయని, ఇది రాబోయే రోజుల్లో అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులను భయపడేలా చేయడమేనన్నారు. కశ్మీర్లో పెట్టుబడులు ఆపడం, పర్యాటకులను రాకుండా అడ్డుకోవడం, హిందూ భూములకు, ఆస్తులకు భద్రత లేదనే భావన కల్పించేందుకే పాక్మూకలు ఈ దాడులకు తెగబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ రాష్ట్ర మీడియా కన్వీనర్ మాళిగి భానుప్రకాశ్, వీహెచ్పీ రాష్ట్ర నాయకుడు టి. ప్రతాపరెడ్డి, జిల్లా అధ్యక్షుడు టీసీ మద్దిలేటి, జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు, ఆర్ఎ్సఎస్ నాయకుడు రామకృష్ణ, బీజేపీ నాయకులు రంగస్వామి, కాశీ విశ్వనాథ్, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎం. నాగఫణిశాస్త్రి, ఆపస్ సత్యనారాయణ, కళ్లే చంద్రశేఖర్ శర్మ, రాజేశ్ శర్మ, మహిళా విభాగాల ప్రతినిధులు వరలక్ష్మి, దేవకీదేవిలతోపాటూ వివిధ ధార్మిక, ఆథ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.