Share News

17న సీఎం చంద్రబాబు రాక

ABN , Publish Date - May 15 , 2025 | 12:03 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17వ తేదీన కర్నూలు జిల్లాకు రానున్నారు.

17న సీఎం చంద్రబాబు రాక

సీ క్యాంపు రైతు బజారులో పర్యటన

కేంద్రీయ విద్యాలయంలో ప్రజావేదిక

ఏర్పాట్లపై కలెక్టర్‌ రంజిత్‌ బాషా సమీక్ష

కర్నూలు కలెక్టరేట్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17వ తేదీన కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను అప్రమత్తం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని, అక్కడి నుంచి సీ.క్యాంపు రైతుబజారులో ముఖ్యమంత్రి ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రైతుబజారులో ముఖ్యమంత్రి ఇద్దరు పారిశుధ్య కార్మికులు, ఇద్దరు రైతులతో మాట్లాడుతారన్నారు. అనంతరం నగరంలోని కేంద్రీయ విద్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈసారి స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర థీమ్‌ ‘బీట్‌ దీ హీట్‌ ’ అనే అంశంపై జరుగుతుందన్నారు. అందుకు అనుగుణంగా సీ.క్యాంపు రైతుబజారుతో పాటు నగరంలో కూడా స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర సందర్భంగా తగిన పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. రైతుబజారు కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారన్నారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ సహాయకులుగా ఉంటారన్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సీ.క్యాంపు రైతుబజారులో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావేదికలో పీ-4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో మాట్లాడుతారన్నారు. పార్కింగ్‌ ప్రదేశాలను గుర్తించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ, ఆర్డీవో, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలను కలెక్టర్‌ ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవోలు భరత్‌ నాయక్‌, సందీప్‌ కుమార్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు చిరంజీవి, అజయ్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, కొండయ్య, అనురాధ, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావేదిక స్థల పరిశీలన

కల్లూరు, మే 14(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన్‌ 20వ వార్డు పరిధిలోని కేంద్రీయ విద్యాలయ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పరిశీలించారు. బుధవారం కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాకు విచ్చేయనున్న సీఎం ప్రజావేదిక సభలో పాల్గొంటారని తెలిపారు. ఈనేపథ్యంలో అధికారులు తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. అనం తరం సీ.క్యాంప్‌లోని రైతు బజార్‌ను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 12:03 AM