Share News

టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతం

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:12 AM

నియోజక వర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య మరోసారి వర్గ విభేదా లు బహిర్గతమయ్యాయి.

టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతం
ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొన్న వీరభద్రగౌడ్‌

విజయోత్సవ ర్యాలీలో ఎవరికి వారే యమునా తీరు

వేర్వేరుగా నియోజకవర్గ నాయకుల ర్యాలీ

పూల నాగరాజు వ్యాఖ్యలపై గౌడ్‌ మండిపాటు

అయోమయంలో పార్టీ శ్రేణులు

ఆలూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య మరోసారి వర్గ విభేదా లు బహిర్గతమయ్యాయి. శనివారం పట్టణంలో ‘అన్నదాత సుఖీభవ’పై నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ పార్టీ నాయకుల మధ్య వివాదానికి తెర తీసింది. టీడీపీ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ పూల నాగరాజు ఆధ్వర్యంలో జరగాల్సిన ట్రాక్టర్‌ ర్యాలీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ మేరకు పట్టణ శివారులో ఉన్న హనుమాన్‌ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ బుజ్జమ్మ, మహిళా నేత వైకుంఠం జ్యోతి వెయిట్‌ చేస్తున్నారు. టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ ఆయన వర్గం ట్రాక్టర్లతో ర్యాలీగా వచ్చారు. ముందుగా వైకుంఠం జ్యోతి జెండాలు కట్టిన ట్రాక్టర్లలో కూర్చొన్న వారు గౌడ్‌ను కూడా ట్రాక్టర్‌లోకి ఎక్కాలని ఆహ్వానిం చారు. వ్యక్తిగత జెండాలు ఉంటే తాను ఎక్కేదిలేదని జెండాలు తొలగించాలని వీరభద్రగౌడ్‌ కోరారు. బీటీ నాయుడు జెండాలు తొలగించాలని సూచించడంతో జెండాలు తీసేసి ట్రాక్టర్‌పైకి ఎక్కించారు. గౌడ్‌ వర్గీయులు అందుకు ఒప్పుకోక పోవడంతో గౌడ్‌ కిందకు దిగి తన వర్గం వారు తెచ్చిన ట్రాక్టర్‌లో ఎక్కి ర్యాలీ చేపట్టారు. దీంతో ఇరువురు వేరే ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తుండగా తమ ర్యాలీని నిలిపివేసి మా డీజేను ఎలా వాడుకుంటారని పోలీసులతో గౌడ్‌ వర్గీయులు వాగ్వాదం చేశారు. ఇక గొడవలకి దారి తీస్తుందని తెలుసుకున్న సీఐ రవిశంకర్‌రెడ్డి పరిశీలకులు పూల నాగరాజు, టీడీపీ నాయకురాలు వైకుంఠం జ్యోతి ఉన్న ట్రాక్టర్‌ను ముందుగా తరలించారు. వీరభద్రగౌడ్‌ లేకుండానే స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టి ప్రసంగించారు. పార్టీలో ఎలాంటి వర్గ విబేధాలు లేవని పార్టీ పరిశీలకులు పూల నాగరాజు ప్రకటించారు. వీర భద్రగౌడ్‌ ఇన్‌చార్జి కాదని, ఆయన పార్టీలో సీనియర్‌ నాయకుడు మాత్రమే అని వెల్లడించారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసిన తర్వాత వీరభద్రగౌడ్‌ తన అనుచర వర్గంతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీగా వచ్చి అంబేడ్కర్‌ కూడలిలో సమా వేశం నిర్వహించారు. తాను ఇన్‌చార్జి కాదని ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ ఎలా చెబుతారని ప్రశ్నిం చారు. ఒకే వర్గానికి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. తమ కార్యకర్తలపై వేధింపులకు గురిచేస్తే ఇక సహించ బోనని, అభ్యంతరం తెలిపే అధికారులపై కలెక్టర్‌, ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ నాయకులు కామినహాల్‌ రమేష్‌, కిష్టప్ప, మిక్కిలినేని ప్రసాద్‌, మీనాక్షినాయుడు, కురువ జయరాం, అశోక్‌, రఘు ప్రసాద్‌రెడ్డి, అట్టేకల్‌ బాబు, శేషగిరి, విష్ణు, తిమ్మయ్య, రామచంద్రనాయుడు, సుభాన్‌, ఉచ్చీరప్ప, పాల్‌రెడ్డి, కృష్ణంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:12 AM