కోర్టుకు హాజరుకాని సీఐ
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:47 PM
కర్నూలు తాలుకా పోలీ్సస్టేషన్లో గతంలో నమోదైన ఒక పోక్సో కేసులో సాక్ష్యమివ్వడానికి అప్పటి సీఐ ఓబులేసు కోర్టుకు హాజరు కాలేదు.
నాన్బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ
తాలుకా పోలీసులపై ఆగ్రహం
కర్నూలు లీగల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కర్నూలు తాలుకా పోలీ్సస్టేషన్లో గతంలో నమోదైన ఒక పోక్సో కేసులో సాక్ష్యమివ్వడానికి అప్పటి సీఐ ఓబులేసు కోర్టుకు హాజరు కాలేదు. కర్నూలు పోక్సో కోర్టు న్యాయాధికారి ఈ.రాజేంద్రబాబు బుధవారం సీఐకు అరెస్టు వారెంటు జారీ చేశారు. 2022లో కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్లో 91/22 కేసు నమోదైంది. ఆ కేసులో దర్యాప్తు అధికారి అయిన సీఐ ఓబులేసు గతంలో కూడా కోర్టుకు హాజరు కాలేదు. ఈమేరకు కోర్టు ఆయనపై గతంలో బెయిలబుల్ వారెంట్లు జారీచేసింది. అయినా కూడా ఆయన కోర్టుకు రాకపోవడంతో ఆగ్రహించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెం ట్లు జారీచేసింది. ఈకేసులో తాలుకా పోలీసులు కూడా సీఐకి సమన్లు జారీచేయడంలో నిర్లక్ష్యం వహించారని, కోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం వహించడం తగదని కోర్టు హెచ్చరించింది. ఇతర కేసుల్లో కూడా పోలీసులు సాక్షులకు సమన్లు అందించకుండా కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని కోర్టు ఆగ్రహించింది. అవుకు పోలీస్ స్టేషన్లో నమోదైన వేరో కేసులో విచారణ కోసం షెడ్యూల్ నిర్ణయించినా కూడా పోలీసు సిబ్బంది సమన్లును అందజేయకపోవడంపై న్యాయాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సాక్షులకు సకాలంలో సమన్లను అం దించకపోతే ఎస్పీకి రిపోర్టు చేయాల్సి వస్తుందని న్యాయాధికారి హెచ్చరించారు.