ఉద్యోగమన్నారు.. ఖాతాను ఊడ్చేశారు.!
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:03 AM
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పంథాకు పునాదులు వేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ యువకుడి ఖాతాను ఖాళీ చేశారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో కైరవాడి యువకుడు
విడతలవారీగా రూ.45వేలు నేరగాళ్ల ఖాతాలో జమ
గోనెగండ్ల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పంథాకు పునాదులు వేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ యువకుడి ఖాతాను ఖాళీ చేశారు. ఈ ఘటన మండలంలోని హెచ్. కైరవాడి గ్రామంలో రెండు రోజుల క్రితం జరగగా బాధితుడు కర్నూలు సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. హెచ్ కైరవాడికి చెందిన కురువ వీరేష్ డిగ్రీ చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. జూన్ 26న పక్క లోకల్ అనే యాప్లో ఉద్యో గాల నోటిఫికేషన్ కోసం ఒక లింక్ను క్లిక్ చేశాడు. దీంతో యాప్లో హీరోహోండా షోరూంలో ఉద్యోగాలు ఉన్నట్లు లింక్ ఓపెన్ అయింది. డేటా ఎంట్రీ అపరేటర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందులో లింక్ ఓపెన్ చేయగా అప్లికేషన్ పూర్తి చేయాలని వచ్చింది. ఇందుకుగాను అఫ్లికేషన్ కసం రూ.3000ను తాము చెప్పిన అకౌంట్కు పంపాలని వచ్చింది. దీంతో వీరేష్ రూ.3000ను సైబర్ నేరగాళ్ల అకౌంట్ కు బదిలీ చేశాడు. 27వ తేదిన మళ్లీ ఉద్యోగం కంపెనీలో కావాలంటే కంపెనీ బాండ్ కోసం మరో రూ. 3000 అకౌంట్కు బదిలీ చేయాలని వచ్చింది. దీంతో మరో సారి డబ్బును ఆదే అకౌంట్కు బదిలీ చేశాడు. అలాగే 28న నీకు ఉద్యోగం కన్ఫామ్ అవుతుంది. నీపేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అందుకు గాను రూ.5000 పంపమ న్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఽఆధార్కార్డ నెంబర్ లింక్ చేయడం కోసం మరో రూ. 5000 పంపమన్నారు. దీంతో మొత్తం రూ. 10000 పంపాడు. మరుసటి రోజు(29వ తేది)ఎస్బీఐకు నీ అకౌంట్ లింక్చేయడం కోసం ప్రాసెస్ ఫీజ్ మరో రూ.5000 పంపమన్నారు. దీంతో వీరేష్ ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఇంతకు ముందు మీరు చెల్లించిన మొత్తం మీఅకౌంట్లో జమ కావాలంటే మరో రూ.10వేలు అకౌంట్కు జమ చేయమనడంతో రూ.10వేలు జమ చేశాడు. ఇలా ఐదురోజుల పాటు సైబర్ నేరగాళ్ల అడిగిన విధంగా డబ్బులు చెల్లిస్తు వచ్చాడు. మొత్తం రూ. 45వేలు జమ చేశాడు. మళ్లీ అదేవిధంగా ఫోన్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గోనెగండ్ల పోలీస్స్టేషన్కు వెళ్లాడు. వారు పోలీసులు కర్నూలులోని సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో అక్కడ ఫిర్యాదు చేసినట్లు వీరేష్ తెలిపాడు.