మధ్యవర్తిత్వంతోనే కేసులు పరిష్కారం
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:15 AM
మధ్యవర్తిత్వంతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది పేర్కొన్నారు
జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది
న్యాయసేవా సదన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ
పాల్గొన్న న్యాయాధికారులు, న్యాయవాదులు
కర్నూలు లీగల్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది పేర్కొన్నారు. బుధవారం స్థానిక న్యాయ సేవా సదన్ భవన్లో ‘మధ్యవర్తిత్వం - దేశం కోసం’ అనే అంశం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిలా ్లవ్యాప్తంగా మధ్యవర్తిత్వంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ప్రజలకు మధ్యవర్తిత్వంతో కలిగే లాభాలను వివరించినట్లు తెలిపారు. కక్షిదారులు తమ వివాదాలను ఈ మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకుంటే వ్యయ ప్రయాసలకు లోను కాకుండా ఎలాంటి ఖర్చులు లేకుండా సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక న్యాయ సేవాసదన్ భవనం నుంచి మున్సిప్ కోర్టు మీదుగా కొండారెడ్డి బురుజు వరకు జరిగిన 1కే ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో శాశ్వత లోక్అదాలత్ చైర్మన్ ఎం.వెంకట హరినాథ్, సీనియర్ సివిల్ న్యాయాధికారి దివాకర్లతో పాటు పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.