నకిలీ బిల్లుల వ్యాపారిపై కేసు నమోదు
ABN , Publish Date - May 20 , 2025 | 12:36 AM
నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమ రవాణా చేసి రూ.లక్షలు సొమ్ము చేసుకున్న మేడం సాయికుమార్ అనే వ్యాపారిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
అవుకు, మే 19 (ఆంధ్రజ్యోతి): నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమ రవాణా చేసి రూ.లక్షలు సొమ్ము చేసుకున్న మేడం సాయికుమార్ అనే వ్యాపారిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 17వ తేదీన ఆంధ్రజ్యోతిలో అడ్డదారిలో అక్రమ రవాణా కథనం ప్రచరితమైంది. దీంతో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు పట్టణానికి చెందిన వ్యాపారి సాయి కుమార్ బండారం బట్టబయలైంది. వివరాలివీ..
అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో వ్యాపారి సాయి కుమార్ కడప జిల్లాలోని కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించాడు. ఏకంగా 10 నకిలీ బిల్లులు బయటపడ్డాయి. ఏటా వందల లారీల ధాన్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. గతంలో మాదిరిగానే ఈసారి జిల్లాలో రైతులు పండించిన వరి, జొన్న, శనగ, మొక్కజొన్న పలురకాల పంటల ధాన్యాలను కొనుగోలు చేసి తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాష్ర్టాలకు లారీల ద్వార అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్కు వడ్లకు 2 శాతం, మిగతా ధాన్యానికి 1 శాతం పన్ను చెల్లిం చాల్సి ఉంటుంది. నకిలీ బిల్లులతో మార్కెట్ తనిఖీ కేంద్రాల వద్ద ఎలాంటి పన్ను చెల్లించకుండ లారీల ద్వార ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తూ లక్షలు సొమ్ము ఆర్జిస్తూ వచ్చాడు. గత కొద్ది రోజుల క్రితం కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో తరలిస్తుండగా బేతంచర్ల మార్కెట్ తనిఖీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ జగదీష్ నకిలీ బిల్లుల బాగోతాన్ని గుర్తించి జేడీ దృష్టికి తీసుకెళ్లాడు. జిల్లా చెక్పోస్టుల్లోని రికార్డులను తనిఖీ చేయగా బేతంచర్ల చెక్పోస్టు నుంచి నకిలీ బిల్లులతో పలుమార్లు అక్రమ రవాణా జరిగినట్లు గుర్తించారు. డోన్కు చెందిన లారీ యజమాని ఇచ్చిన సమాచారంతో అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తి సాయికుమార్గా గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బనగానపల్లె మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి ఆధారా లతో సాయికుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రాజరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.